అంటే సుందరానికి గుర్తొస్తున్నాడు

ఇప్పుడు హఠాత్తుగా నాని సినిమా గుర్తుకు రావడం ఏమిటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. గత ఏడాది ఎన్నో అంచనాలతో విడుదలైన అంటే సుందరానికి ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితం అందుకోని సంగతి తెలిసిందే. కథ కథనాల విషయం పక్కనపెడితే నిడివి బాగా దెబ్బ కొట్టిన మాట వాస్తవం. అదే మాట దర్శకుడు వివేక్ ఆత్రేయని అడిగితే ఈ కథకు ప్రతి ఫ్రేమ్ అవసరమేనని, ల్యాగ్ అనే ప్రశ్నే లేదని సమర్ధించుకున్నాడు. కట్ చేస్తే సింపుల్ లైన్ మీద సాగే కూల్ ఎంటర్ టైనర్ ని మూడు గంటల లెన్త్ తో చూడటం ప్రేక్షకుల వల్ల కాలేదు. దాంతో నష్టాలు తప్పలేదు.

ఈ ప్రస్తావన ఎందుకంటే ఖుషికి సేమ్ టు సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. 2 గంటల 45 నిమిషాల నిడివి ఆమోదయోగ్యంగా లేదనే అభిప్రాయం రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ లోనూ వ్యక్తమయ్యింది.తీరా చూస్తే మొదటి మూడు రోజులు బాగానే రాబట్టిన ఖుషి హఠాత్తుగా విపరీతమైన డ్రాప్ చూపించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ చెప్పిన రెండు సినిమాలు మైత్రి వాళ్ళవే కావడం గమనార్హం. కనీసం ఓ ఇరవై నిమిషాల కోత వేసి ఉంటే ప్రభావం సానుకూలంగా ఉండేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. కాశ్మీర్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వేరు కాపురం పెట్టాక అవసరం లేని సాగతీత గట్టిగానే ఉంది.

అంటే మూడు గంటల సినిమాలను చూసే ఓపిక ప్రేక్షకుల్లో లేదని కాదు. అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం, బేబీ ఇవన్నీ నిడివితో సంబంధం లేకుండా రికార్డులు సృష్టించిన బ్లాక్ బస్టర్లు. వాటిలో అంత కట్టిపడేసే కంటెంట్ ఉంది. కానీ అంటే సుందరానికి, ఖుషిలు లైటర్ వీన్ కథలు. వీలైనంత క్రిస్పీగా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అంతే తప్ప ఎమోషన్ల పేరిట ఎక్కువ సన్నివేశాలు పేర్చుకుంటూ పోతే అంతగా ఏం లేదనిపిస్తుంది. ఇకనైనా కుర్ర దర్శకులు ఇలాంటి సబ్జెక్టులను డీల్ చేసేటపుడు లెన్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.