బాలీవుడ్ ఇష్టం వల్ల అంతా నష్టమే

సౌత్ లో ప్రూవ్ చేసుకున్నాక బాలీవుడ్ లోనూ జెండా పాతాలని హీరోయిన్స్ కి అనిపించడం సహజం. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. విజయశాంతి, రమ్యకృష్ణ కాలం నుంచి కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే దాకా అందరూ ట్రై చేసినవాళ్ళే. కాకపోతే నార్త్ భామలకు ధీటుగా నిలబడలేక తిరిగి వెనక్కు వచ్చిన బ్యాచే ఎక్కువ. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. పుష్ప రాజ్ ప్రియురాలు శ్రీవల్లిగా క్లాసుకి మాసుకి బాగా దగ్గరైన రష్మిక మందన్న మాత్రం ఈ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు చేటే చేస్తున్నాయి.

ఇటీవలే తను నితిన్-వెంకీ కుడుములు కాంబో మూవీని వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ ఛాన్స్ శ్రీలీల కొట్టేసింది. కారణం ఏంటయ్యా అంటే గతంలో షాహిద్ కపూర్ సినిమా కోసం ఇచ్చిన కమిట్ మెంట్. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ యాక్షన్ డ్రామాని క్యాన్సిల్ చేసినట్టు ముంబై రిపోర్ట్. అనీజ్ బాజ్మీ దర్శకత్వంలో షాహిద్ డ్యూయల్ రోల్ లో భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేశారు. మై ఆవూగా యుపి బీహార్ లూట్నే టైటిల్ కూడా అనుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ బడ్జెట్ ఇష్యూస్ ని సాకుగా చూపిస్తూ ఆపేశారట. ఇప్పుడు దానికి కేటాయించిన డేట్లు వృధా అవుతాయి.

వాటిని పుష్ప 2, రైన్ బో కోసం వాడుకోవచ్చు కానీ రష్మిక బాలీవుడ్ కలలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ పంచుకున్న గుడ్ బై ఘోరంగా పోయింది. సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన మిషన్ మజ్నుకి నెగటివ్ రెస్పాన్స్ దక్కింది. యానిమల్ విడుదల వాయిదా పడుతూ డిసెంబర్ కు వెళ్ళింది. ఇది ఎంత పెద్ద హిట్టయినా క్రెడిట్ మొత్తం రన్బీర్ కపూర్, సందీప్ వంగాలే పంచుకుంటారు. ఇదంతా కాదు కానీ రష్మిక మందన్న ఇకనైనా సౌత్ మార్కెట్ మీద సీరియస్ ఫోకస్ పెట్టాలి. మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ లాంటి స్టార్లతో చేసి హిందీలో మీడియం రేంజ్ పక్కన నటించాలనే తాపత్రయం ఎందుకనేది ఫ్యాన్స్ ప్రశ్న.