జాతీయ అవార్డుల తీరు మారిందా?

జాతీయ అవార్డులు అనగానే ఒకప్పుడు జ్యూరీ సభ్యుల ఆలోచన తీరే వేరుగా ఉండేది. ఉదాత్తమైన సినిమాలకు.. మంచి సందేశం ఉన్న వాటికి.. జనం మీద చెడు ప్రభావం చూపిన వాటికి అవార్డులు ఇవ్వడానికి చూసేవారు. ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఇచ్చేటపుడు కూడా ఆయా పాత్రల్లోని ఔన్నత్యం చూసేవారు. పాజిటివ్ లక్షణాలున్న పాత్రలకే ప్రాధాన్యం దక్కేది. సగటు కమర్షియల్ సినిమాలను అవార్డులకు అస్సలు పరిగణనలోకి తీసుకునేవాళ్లు కాదు.

బెస్ట్ యాక్టర్ అవార్డులు ఇచ్చేటపుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న, ప్రతికూల ప్రభావం చూపే పాత్రల వైపు సాధ్యమైనంత వరకు చూసేవాళ్లు కాదు. దీంతో అవార్డు సినిమాలు, పాత్రలు అంటే వేరు అనే అభిప్రాయం ఉండేది. డబ్బులు రాని సినిమాలకే అవార్డులని.. పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన సినిమాలు అవార్డుల గురించి ఆలోచించే అవకాశమే ఉండదని ఫీలయ్యేవాళ్లు.

కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ‘బాహుబలి’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం సక్సెస్ చూసి అవార్డు ఇచ్చారని చాలామంది విమర్శలు గుప్పించారు. ఐతే ఆ చిత్రంతో మారిన జ్యూరీ సభ్యుల మైండ్ సెట్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ‘పుష్ప’ సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడు, సంగీతానికి దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు అందుకోవడం చాలామందికి షాకింగే. ఒక స్మగ్లర్ పాత్రకు అవార్డేంటి.. ‘పుష్ప’లో ఉన్నవన్నీ మాస్ సాంగ్స్ కదా ఇలాంటి చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి.

కానీ ఒక పాత్రను నటుడు ఎలా చేశాడు.. ఎంత కన్విన్సింగ్‌గా పెర్ఫామ్ చేశాడు అన్నది చూశారే తప్ప.. పాత్ర లక్షణాల గురించి జ్యూరీ సభ్యులు ఆలోచించలేదు. దేవి పాటల విషయంలోనూ అంతే. ‘ఆర్ఆర్ఆర్’కు నేపథ్య సంగీతం విషయంలో కూడా ఇలాగే చూశారు. ‘ఉప్పెన’ను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక చేయడంలో కూడా కొందరికి అభ్యంతరాలున్నాయి. కానీ ఇక్కడ కూడా జ్యూరీ సభ్యులు ఒక గిరి గీసుకుని కూర్చోలేదని స్పష్టమవుతోంది. మున్ముందు కమర్షియల్ సినిమాలు, అవార్డు సినిమాలు అనే గీత చెరిగిపోయి.. పురస్కారాల తీరే మారిపోనుందని అర్థమవుతోంది. 2022కి ‘కేజీఎఫ్’ అవార్డుల పంట పండించుకున్నా ఆశ్చర్యం లేదు.