బాలు కోసం ఒక ఐదు నిమిషాలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల తొలి వారంలో కరోనా బారిన ఆయన.. కొన్ని రోజుల కిందట పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేరడం, ఆ తర్వాత వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడం తెలిసిన సంగతే.

ఇక అప్పట్నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియులు.. బాలు ఆరోగ్యం కుదుటపడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. మధ్యలో ఆయన కొంచెం కోలుకున్నారని వార్తలు రాగానే.. ఇంకేముంది కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తారు.. డిశ్చార్జి కూడా అయిపోతారని అనుకున్నారు. కానీ బాలు ఆరోగ్యం ఆ తర్వాత ఏమాత్రం మెరుగుపడినట్లు సంకేతాలు కనిపించడం లేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

బాలు తమవాడు కాకపోయినా వివిధ భాషల వాళ్లు ఆయన్ని ఓన్ చేసుకుంటూ కురిపిస్తన్న ప్రేమాభిమానాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా తమిళులు బాలు కోసం తపిస్తున్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలు కోసం తమిళ సినీ పరిశ్రమ ఓ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

బాలు ఆరోగ్యం కోసం ఎవరికి వాళ్లు ప్రార్థిస్తున్నారు కానీ.. ఉమ్మడిగా ఆయన కోసం ప్రార్థించాలని అభిమానులను కోరింది. ఇందుకోసం గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు తాము ఉన్న చోటి నుంచి బాలు పాటను ప్లే చేస్తూ ప్రార్థన చేయాల్సి ఉంటుంది.

కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్, ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్, భారతీరాజా సహా అక్కడి వాళ్లందరూ ఇదే పని చేసి వీడియోలు పోస్ట్ చేయనున్నారు. దేవుడనే వాడు ఉంటే.. కచ్చితంగా ఈ ఉమ్మడి ప్రార్థనను విని బాలును కాపాడతాడన్నది వారంటున్నమాట. మన బాలు కోసం వేరే సినీ పరిశ్రమ ఇంతగా తపిస్తుండటాన్ని బట్టి ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు.