ఇద్దరు సీతలు సమానంగా పంచుకున్నారు

అరవై తొమ్మిదవ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే కావడం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కు గాను అలియా భట్, మిమిలో అదిరిపోయే నటన ప్రదర్శించినందుకు కృతి సనన్ ని కమిటీ గుర్తించింది. ఒకరు ఆర్ఆర్ఆర్ లో సీతగా నటిస్తే మరొకరు ఆదిపురుష్ లో రామసతి సాధ్విమణిగా మెప్పించింది. కాకతాళీయమే అయినప్పటికీ తక్కువ గ్యాప్ లో ఇద్దరూ సీత పేరుతో పాత్రల్లో కనిపించడం విశేషం. ఈ సినిమాలు అవార్డులకు సంబంధం లేనిదే అయినా చెప్పుకోదగ్గ వార్తేగా.

ఎలా చూసుకున్నా అలియా, కృతిలు దీనికి సంపూర్ణంగా అర్హత కలిగినవాళ్ళే. కృతి సనన్ కి టాలీవుడ్ తో ఎక్కువ అనుబంధం ఉంది. మహేష్ బాబు 1 నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్ లు చేసింది కానీ వాటి ఫలితాలు అచ్చిరాక హిందీ సినిమాలకు పరిమితమయ్యింది. ఎక్కువ గ్లామర్ పాత్రలకు వాడుకునే తనకు నటనలో స్కోప్ దక్కింది మిమిలోనే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎంటర్ టైనర్ లో కృతి నటన చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక గంగూబాయ్ లో వేశ్యగా అలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. నటించడం కన్నా జీవించిందని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.

ఇతర భాషలతో పోలిస్తే ఈసారి టాలీవుడ్ డామినేషన్ సంపూర్ణంగా కనిపించింది. కన్నడలో 777 ఛార్లీ, మలయాళంలో హోమ్, తమిళంలో కడైసి వివసాయిలు గుర్తింపు దక్కించుకున్నాయి. కోలీవుడ్ కు మాత్రం పెద్ద అసంతృప్తి మిగిలింది. కన్నడలో ఎప్పుడూ నెంబర్ భారీగా ఉండదు కాబట్టి ఆశ్చర్యం లేదు కానీ కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టే మళయాలంలోనూ ఈసారి ఎక్కువగా హైలైట్ అయినవి లేకపోవడం గమనార్హం. మొత్తానికి జాతీయ అవార్డులు కొంచెం ఇష్టం కొంచెం కష్టం తరహాలో అన్ని ఇండస్ట్రీలను సమాన స్థాయిలో మెప్పించడం కష్టమని తేలిపోయింది.