జైలర్ చూశాక జవాన్ ఆశ పెరిగింది

ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో భీభత్సమైన వసూళ్లు చూసి చాలా కాలమయ్యింది. రజనీకాంత్ జైలర్ సునామి చూశాక అందరికీ డౌట్లు తీరిపోయాయి. కేవలం పన్నెండు కోట్లకు అమ్మితే రెండు వారాలు తిరక్కుండానే ముప్పై కోట్ల లాభాలకు దగ్గరగా వెళ్లడం నిర్మాతలు కలలో కూడా ఊహించలేదు. ఒకవేళ ముందే గెస్ చేసి ఉంటే రెట్టింపు ధరకు అమ్మేవారన్నది వాస్తవం. దెబ్బకు మిగిలిన వాటికి ఆశ పెరిగింది. షారుఖ్ ఖాన్ జవాన్ ని తెలుగు రాష్ట్రాల హక్కులను హిందీ వెర్షన్ తో కలిపి 55 కోట్లకు అమ్మారని ట్రేడ్ టాక్. అంటే బ్రేక్ ఈవెన్ జరగాలంటే దీనికి అదనంగా ఇంకో రెండు కోట్లు రాబట్టాలి .

జైలర్ కు సాధ్యమయ్యింది కాబట్టి జవాన్ కు అంతే స్పందన ఆశించలేం. ఎందుకంటే రజనీకాంత్ కు దశాబ్దాల తరబడి మన ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ ఉంది. కానీ షారుఖ్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోగా మాత్రమే మనకు పరిచయం. అలాంటిది జవాన్ అంత వసూళ్లు తేగలడా అంటే డిస్ట్రిబ్యూటర్ పఠాన్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీ తెలంగాణ నుంచి 50 కోట్ల గ్రాస్ వచ్చింది. ముఖ్యంగా నైజామ్ లో భారీ ఎత్తున రాబట్టింది. దాంతో పోలిస్తే జవాన్ లో సౌత్ నేటివిటీ ఎక్కువగా ఉంది. నయనతార, విజయ్ సేతుపతి లాంటి క్యాస్టింగ్ తో పాటు అనిరుద్ రవిచందర్ సంగీతం దానికి కారణం.

ప్రస్తుతానికి ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి కానీ భారీ హైప్ ఇంకా రావాల్సి ఉంది. చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి కొత్త ట్రైలర్ లాంచ్ చేశాక లెక్కలు మారిపోతాయని రెడ్ చిల్లీస్ సంస్థ నమ్మకంగా ఉంది. సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో షారుఖ్ స్వయంగా నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాకు అట్లీ దర్శకత్వం బజ్ ని పెంచుతోంది. ఇప్పటిదాకా వచ్చిన పాటలు జనాన్ని మరీ ఓ రేంజ్ లో ఊపేయలేదు కానీ స్క్రీన్ మీద చూశాక రెస్పాన్స్ మారిపోతుందని అంటున్నారు. సెప్టెంబర్ 7 ఎంతో దూరంలో లేదు. ఒకే ఏడాది షారుఖ్ రెండు హిట్లు కొట్టి చాలా కాలమయ్యింది. దీంతో నెరవేరుతుందేమో చూడాలి.