మోక్షజ్ఞను చూశాక డౌట్లు తీరిపోయాయి

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి మెల్లగా దారి సుగమం అవుతోంది. నిన్న జరిగిన సుహాసిని కొడుకు వివాహానికి హాజరైన చిన్న బాలయ్యని చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. ఇంతకు ముందు బొద్దుగా ఉన్న రూపాన్ని సన్నబడేలా చేసుకోవడమే కాక లుక్స్ పరంగానూ అతనిలో చాలా మార్పు వచ్చింది. తండ్రితో కలిసి వచ్చి కలివిడిగా తిరగడమే కాదు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ముచ్చటించడం, కలిసి ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరుదైన కలయికగా ఫ్యాన్స్ ట్వీట్ల రూపంలో పంచుకుంటున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ శిక్షణకు ఇంకో ఆరేడు నెలలు పడుతుందని తెలిసింది. అది పూర్తి కాగానే ఎవరితో ఎలా లాంచ్ చేయించాలనే విషయంలో బాలయ్య ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే పలు ప్రతిపాదనలున్నాయి. పూరి జగన్నాధ్, బోయపాటి శీను, అనిల్ రావిపూడి ఇలా రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళ అందుబాటు, స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి కుదరని పక్షంలో బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999ని ఎలాగూ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అదే ఉండొచ్చు.

వీలైనంత త్వరగా లాంచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య క్రమంగా వయసుకు తగ్గట్టు భగవంత్ కేసరి లాంటి పాత్రల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు కాబట్టి కమర్షియల్ హంగులున్న గ్లామర్ ప్లస్ యాక్షన్ హీరోగా మోక్షజ్ఞను చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డెబ్యూ పరంగా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో బాలయ్యకు తెలియనిది కాదు. తన ఎంట్రీ టైంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత శ్రద్ధ తీసుకుని కెరీర్ ని మలచారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా కొడుకు భవిష్యత్తుని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఒక ఫంక్షన్ ఫోటో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.