పవన్‌ సినిమా తర్వాత.. పవన్ ఫ్యాన్‌తోనే

Venu Sriram

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. వారిలో పలువురు స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి.. ఇలా జాబితా కొంచెం పెద్దదే. తాను పరిచయం చేసిన దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా సరే.. అతడికి సక్సెస్ వచ్చే వరకు తన కాంపౌండ్లోనే పెట్టుకుంటాడు రాజు. ఇలా చాన్నాళ్ల పాటు రాజుతో కొనసాగిన దర్శకుల్లో వేణు శ్రీరామ్ ఒకడు.

అతను ‘ఓ మై ఫ్రెండ్’ అనే ఫ్లాప్ మూవీతో దర్శకుడయ్యాడు. అయినా అతణ్ని నమ్మి ‘ఎంసీఏ’ చేయగా.. అది కమర్షియల్‌గా మంచి ఫలితాన్నే అందించింది. వేణు తొలి సినిమా తర్వాత వచ్చినట్లే రెండో సినిమాకు కూడా గ్యాప్ తప్పలేదు. కానీ ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకుని ‘వకీల్ సాబ్’తో సక్సెస్ సాధించాడు వేణు.

కానీ మళ్లీ వేణు కెరీర్లో గ్యాప్ తప్పలేదు. అల్లు అర్జున్‌తో అనుకున్న ‘ఐకాన్’ ఎటూ తేలకుండా పోయింది. ఇంకే స్టార్ హీరో కూడా దొరకలేదు. చివరికి నితిన్‌తో సంప్రదింపులు జరిగాయి. అతడితోనే సినిమా ఓకే అయింది. దీంతో పవన్ తర్వాత పవన్ ఫ్యాన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు వేణు. వీరి కలయికలో ఒక యాక్షన్ డ్రామా రాబోతోందట. కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా ఉంటుందట.

ఎప్పట్లాగే వేణు కొత్త సినిమాను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. నితిన్‌తో ‘దిల్’ లాంటి బ్లాక్ బస్టర్, ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి డిజాస్టర్ తీశాడు రాజు. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా రాబోతోంది. ప్రస్తుతం నితిన్.. వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చేస్తున్నాడు. దాని చిత్రీకరణ చివరి దశలో ఉంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి తన పని పూర్తయ్యాక వేణు సినిమాను పట్టాలెక్కిస్తాడు నితిన్.