అనుష్క అభిమానుల కోరిక తీరదా

సెప్టెంబర్ 7 విడుదల కాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద ప్రేక్షకులకు మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. రాబోయే రెండు వారాలు యువి క్రియేషన్స్ నాన్ స్టాప్ ప్రమోషన్లు చేయనుంది. ఇందులో భాగంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీట్ ది ప్రెస్ అన్నీ ఉంటాయి. అభిమానుల సమ్మేళనం లాంటివి ప్లాన్ చేయబోతున్నారు. అయితే స్వీటీ అనుష్క మాత్రం వీటిలో భాగం కాబోవడం లేదని ఇన్ సైడ్ టాక్. ఇంతకు ముందే షూట్ చేసిన ఒక వీడియో ముఖాముఖీ తప్ప తనవైపు ప్రత్యక్షంగా హాజరయ్యే సందర్భం ఉండకపోవచ్చని అంటున్నారు.

కారణాలు చెప్పలేదు కానీ టైటిల్ రోల్ లో సగం తన పేరు మీదే ఉన్నా అనుష్క ఇలా దూరంగా ఉండటం అభిమానులను బాధించేదే. ఎందుకంటే స్వీటీని తెరమీద చూసి చాలా కాలమయ్యింది. భాగమతి తర్వాత నిశ్శబ్దం డైరెక్ట్ ఓటిటిలో వచ్చింది. సైరా నరసింహారెడ్డిలో జస్ట్ మెరుపులా ఒక సీన్ చేసింది అంతే. అక్కడి నుంచి తను ఒప్పుకున్న ఒకే ఒక సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. హీరో నవీన్ మాత్రం కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ జూన్ లోనే కాలేజీలు తిరుగుతూ చాలా ప్రోగ్రాంస్ చేశాడు. ఇప్పుడో పది రోజులు షూటింగులకు బ్రేక్ తీసుకుని పబ్లిసిటీలో భాగమయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు.

జోడిగా నటించిన అనుష్క కూడా పక్కనే ఉంటే బాగుండేది. మరి తర్వాత మనసు మారి కెమెరా ముందుకు వస్తుందో లేదా ఆరోగ్యమో మరో కారణం వల్ల వద్దనుకుంటుందో వేచి చూడాలి. హైప్ సంగతి ఎలా ఉన్నా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి అదే రోజు షారుఖ్ ఖాన్ జవాన్ తో గట్టి పోటీ ఉంది. దాన్ని ధీటుగా ఎదురుకోవాలంటే  కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనే టాక్ రావాలి. నిర్మాతలు ఆ విషయంలో నమ్మకంగానే ఉన్నారు. ఒక చెఫ్ కి ఒక స్టాండప్ కమెడియన్ కి మధ్య జరిగే స్వీట్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు రధన్ సంగీతం సమకూర్చగా పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు.