ముందే ఊహించి ‘బ్రో’ని ఇచ్చేశారు  

పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైం కాంబినేషన్ లో వచ్చిన బ్రో ది అవతార్ థియేట్రికల్ రిలీజ్ జరుపుకుని నెల కూడా పూర్తవ్వకుండానే ఆగస్ట్ 25న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంతో కలిపి మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మొదటి పది రోజులు ఓ మోస్తరుగా రన్ అయిన బ్రో తర్వాత పూర్తిగా నెమ్మదించిపోయింది. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే మూవీస్ దెబ్బకు పూర్తిగా సెలవు తీసుకోవాల్సి వచ్చింది. అడపాదడపా కొన్ని సెంటర్లలో ఉన్నా నమోదవుతున్న షేర్లు నామమాత్రమే.

ఓవరాల్ గా జరిగిన బిజినెస్ పరంగా చూసుకుంటే బ్రో తెచ్చిన నష్టం ముప్పై కోట్ల దాకా ఉంటుందని ట్రేడ్ రిపోర్ట్. ఇది ఎలాగూ పెద్ద స్థాయిలో ఆడదని ముందుగా ఊహించే దానికి అనుగుణంగా ఓటిటి అగ్రిమెంట్ చేసుకున్నట్టు స్పష్టమైంది. పవన్ ఇమేజ్ పుణ్యమాని అరవై కోట్ల దాకా వసూలు చేయగలిగింది కానీ ఇంత వీక్ కంటెంట్ లో మరో హీరో కనక అయితే రెండో రోజే టపా కట్టేసేదన్న మాట వాస్తవం. కొంత హమ్మయ్యా అనుకునే విషయం ఏంటంటే భోళా శంకర్ అంత దారుణంగా బ్రో పెర్ఫార్మ్ చేయకపోవడం అభిమానులకు ఊరట కలిగించింది. అయినా సరే ఫ్లాప్ కాదనలేరుగా.

ఒకరకంగా చూసుకుంటే బ్రో లాంటివి వీలైనంత త్వరగా ఓటిటిలో వచ్చేయడం మంచిదే. లేదంటే ఆసక్తి స్థాయి తగ్గిపోయి వ్యూస్ కి ఎసరు పడుతుంది. భోళా శంకర్ సైతం మూడు వారాలకే వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నట్టు డిజిటిల్ వర్గాల టాక్. నష్టాల సంగతి ఎలా ఉన్నా బ్రో నిర్మాతలు మాత్రం సేఫ్ గా గట్టెక్కారు. పవన్ రెమ్యునరేషన్ తప్ప బడ్జెట్ పరంగా ఎలాంటి రిస్క్ లేకుండా దర్శకుడు సముతిరఖని, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేయడం వల్ల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ముప్పు తప్పింది. బయ్యర్లకు వచ్చిన లాసులను తర్వాత సినిమాలతో సర్దేస్తారు కాబట్టి సమస్య లేదు.