లావణ్యతో ప్రేమ, పెళ్లిపై వరుణ్..

హీరోలు తమ కోస్టార్స్‌ను పెళ్లాడటం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. అక్కినేని నాగార్జున-అమల దగ్గర్నుంచి ఈ కోవలో ఎన్నో జంటలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరుతున్న జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలదే. వీరి ప్రేమాయణం గురించి కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నప్పటికీ.. అవి నిజం అనిపించేలా చిన్న ఆధారం కూడా బయటికి రాలేదు.

తమ ప్రేమాయణాన్ని సాధ్యమైనంత వరకు గుట్టుగా ఉంచడంలో ఈ జంట విజయవంతమైంది. నేరుగా ఎంగేజ్మెంట్ న్యూస్‌తో ఈ జోడీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా వీళ్లిద్దరూ లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నారు. ఐతే తన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో వరుణ్ తన ప్రేమ, పెళ్లి గురించి కొంత ఓపెన్ అవుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ ఎలా మొదలైందో.. పెళ్లి ఎప్పుడు ఉంటుందో అతను వివరించాడు.

‘‘నేను ప్రైవేట్ పర్సన్‌ని. వ్యక్తిగత విషయాలు బయటి వాళ్లకు తెలియకూడదు అనుకుంటాను. అందుకే సోషల్ మీడియాలో నా వ్యక్తిగత విషయాలేవీ పంచుకోను. అందుకే లావణ్యతో నా రిలేషన్‌షిప్‌ గురించి ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. నిశ్చితార్థం అయినపుడు మాత్రమే అధికారికంగా ఫొటోలు రిలీజ్ చేశాను. లావణ్యతో ‘మిస్టర్’ టైంలో బాగా పరిచయం ఏర్పడింది. అప్పటికి తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. మా ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. జీవిత భాగస్వామి ముందు మనకు మంచి ఫ్రెండ్‌గా ఉండాలి అనుకుంటాను.

లావణ్య అలాంటి వ్యక్తే. మేమిద్దరం వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోగలం. ‘అంతరిక్షం’ సినిమా కంటే మేమిద్దరం రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోగలం అనుకున్నాక పెద్దవాళ్లకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాం. ఈ ఏడాది చివర్లో మా పెళ్లి ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగే ఉండొచ్చు. హైదరాబాద్ నాకు చాలా ఇష్టమైన సిటీ అయినప్పటికీ.. పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రశాంతంగా సాగాలంటే డెస్టినేషన్ వెడ్డింగే కరెక్ట్ అనుకుంటున్నాం. అందుకే రెండు మూడు ప్రదేశాలను పరిశీలిస్తున్నాం’’ అని వరుణ్ తెలిపాడు.