ఇద్దరు ప్రభాస్ లు ఒకేసారి కనిపిస్తే అరాచకమే  

వచ్చే నెల 28న విడుదల కాబోతున్న సలార్ మీద హైప్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా ఒక చిన్న టీజర్ తప్ప హోంబాలే ఫిలిమ్స్ పెద్దగా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. అయితే లీకుల రూపంలో వస్తున్న కొన్ని సంగతులు మాత్రం మాములు గూస్ బంప్స్ ఇచ్చేలా లేవు. అందులో ఒకటి ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయడం. ఇది చూచాయగా గతంలోనే బయటికి వచ్చింది కానీ బాహుబలి లాగా ఇందులో ఇద్దరూ కలవరేమోననే సంశయం అభిమానులను వెంటాడుతోంది. ఎందుకంటే ద్విపాత్రాభినయం అంటే స్క్రీన్ మీద డబుల్ బొనాంజా ఒకేసారి జరిగితేనే కిక్కు.

విశ్వసనీయ సమాచారం మేరకు సలార్ లో వెయ్యి మంది ఫైటర్లు ప్రభాస్ ని చుట్టుముట్టే సీన్ ఒకటి ఉందట. వాళ్ళను ఎదురుకోవడానికి తన శాయశక్తులా పోరాడుతున్న క్రమంలో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం చేసుకునే లోపే మరో ప్రభాస్ వచ్చి ఊచకోత కోసే ఎపిసోడ్ కి థియేటర్లలో కూర్చోవడం కష్టమేనంటున్నారు. ఇది తండ్రి కొడుకుల కాంబోగా వస్తుందని, కొడుకు ప్రమాదంలో ఉంటే తండ్రి రక్షిస్తాడా లేక రివర్స్ లో ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్లకు ప్రత్యర్థులుగానే జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలు ఉండబోతున్నాయి. కాన్సెప్ట్ థ్రిల్లింగ్ గా ఉంది కదూ.

సలార్ నుంచి మూవీ లవర్స్ కోరుకుంటున్నవి ఇవే. కెజిఎఫ్ తర్వాత అంతకు మించి అంచనాలు పెంచేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మించే అవుట్ ఫుట్ ఇచ్చేలా స్టూడియోలోనే ఇరవై నాలుగు గంటలు ఉండిపోతున్నారట. ట్రైలర్ కట్ ని ఫైనల్ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్విరామంగా చేయించే పనిలో తెగ బిజీగా ఉన్నట్టు బెంగళూరు టాక్. సెప్టెంబర్ 28 తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆ మేరకు ఓవర్సీస్, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఫైర్ వర్క్స్  కోసం ఎదురు చూడటమే మిగిలింది.