ఇద్దరు హీరోల మీద 120 కోట్ల పెట్టుబడి

వచ్చే నెల విడుదల కాబోతున్న సినిమాల్లో భారీ అంచనాలు మోస్తున్న వాటిలో ఖుషి, స్కందలు ముందు వరసలో ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా రెండింటి థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లను దాటేసిందని ట్రేడ్ టాక్. విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ తర్వాత వస్తున్నాడు. అయినా సరే రౌడీ బాయ్ ఇమేజ్, కంటెంట్, సమంతా, మైత్రి నిర్మాణం వెరసి మంచి బజ్ వచ్చేలా చేశాయి. యాభై అయిదు నుంచి అరవై కోట్ల మధ్యలో డీల్స్ పూర్తవుతాయని సమాచారం. ఏడో తేదీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చే లోపు అన్ని భాషల్లో వీలైనంత రాబట్టుకునే లక్ష్యంతో ఖుషి ప్రమోషన్లు చేస్తోంది.

ది వారియర్ లాంటి దారుణమైన దెబ్బ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు బోయపాటి శీనుతో చేతులు కలపడం చాలా  ప్లస్ అవుతోంది. అఖండ నెక్స్ట్ మూవీ కావడంతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ కాంబో మీద భారీ నమ్మకం ఏర్పడింది. పైగా టీజర్ ఆకట్టుకునేలా ఉండటం, వచ్చిన రెండు పాటల్లో శ్రీలీల హుషారుకి రామ్ డాన్సులను జోడించడం లాంటివి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అరవై నుంచి అరవై అయిదు కోట్ల మధ్య ఫైనల్ సెటిల్ మెంట్స్ జరగొచ్చని అంటున్నారు. ఖుషికి దీనికి రెండు వారాల గ్యాప్ ఉండటం ఎగ్జిబిటర్ల కోణంలో చాలా సానుకూలాంశం.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇంత పెట్టుబడిని వెనక్కు తేవడం విజయ్ దేవరకొండ, రామ్ లకు సవాలే. ఒకవేళ నెగ్గితే మార్కెట్ మరింత బలపడుతుంది. ఏ కొంచెం తేడా వచ్చినా ఇబ్బంది తప్పదు. ఖుషికి రిస్క్ తక్కువ కానీ స్కంద మాత్రం చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఎంత డబ్బింగ్ సినిమాలే అయినా లారెన్స్, విశాల్ లను మరీ తక్కువంచనా వేయడానికి లేదు. కాకపోతే థియేటర్ల కౌంట్, హైప్ గట్రా రామ్ కే అనుకూలంగా ఉంటాయి కానీ వసూళ్ల విషయంలో మాత్రం టాక్ కీలక పాత్ర పోషిస్తుంది.  మొత్తానికి విజయ్ దేవరకొండ, రామ్ లకు పెద్ద టార్గెట్లే ఫిక్సయ్యాయి.