ట్రోలింగ్ కళ్ళలో పడ్డ సిద్ శ్రీరామ్

మ్యూజిక్ లవర్స్ లో గాయకుడు సిద్ శ్రీరాంకి ఎంత ఫాలోయింగ్ ఉందో బాషా దోషాల వల్ల ట్రోలింగ్ చేసే యాంటీ ఫ్యాన్స్ కూడా అంతే ఉన్నారు. శంకర్ ఐ నుంచి అల వైకుంఠపురములో దాకా ఎన్నోసార్లు వాళ్లకు టార్గెట్ అయ్యాడు కానీ తన పాటల ప్రవాహానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే ఈసారి కాస్త వెరైటీ పాయింట్ మీద సిద్ శ్రీరామ్ సోషల్ మీడియాకు దొరికిపోయాడు. నిన్న జరిగిన ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో వచ్చిన ప్రేక్షకులను ఉత్సాహ పరచడం కోసం అ ఆ ఆహా ఓ అంటూ చప్పట్లు కొడుతూ చిన్నపాటి స్టెప్పులు వేస్తూ కోరస్ పాడించే ప్రయత్నం ఎందుకో కొంచెం తేడా కొట్టేసింది.

దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఒకరి నుంచి మరొకరికి వేగంగా పాకిపోతోంది. అక్కడ సిద్ శ్రీరామ్ ఉద్దేశం లైవ్ గా జోష్ తెప్పించాలని. కానీ మెలోడీ సాంగ్ తో అలా చేయడం కష్టం. ఆ మధ్య జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ రవిచందర్ స్టేజి ఎక్కి ఎదురుగా రజినీకాంత్ ఉన్న సంగతే మర్చిపోయి గూస్ బంప్స్ వచ్చేలా స్టేజి పెర్ఫార్మన్స్ ఇవ్వడం మాములుగా పేలలేదు. ఆ స్థాయిలో తాను ఏదైనా కిక్ ఇచ్చే పని చేద్దామనుకున్న సిద్ శ్రీరామ్ కి అది సరైన రీతిలో కుదరక ఇలా దొరికిపోవాల్సి వచ్చింది. ఆడియన్సే కాదు విజయ్, శివ నిర్వాణలు కూడా నవ్వడం కనిపించింది

ఇలాంటి సంఘటనల వల్ల సిద్ శ్రీరామ్ కి వచ్చిన నష్టమేమి లేదు కానీ ఈవెంట్ తాలూకు పబ్లిసిటీ మాత్రం ట్విట్టర్ లో ఫ్రీగా జరిగిపోతుంది. విజయ్ దేవరకొండ-సమంతాల లైవ్ డాన్స్ తర్వాత అంతగా రీచ్ అయిన వీడియో ఈ గాయకుడిదే. అంచనాల పరంగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఖుషి మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది. గ్యారెంటీ ఎంటర్ టైన్మెంట్ ప్లస్ ఎమోషన్స్ అనే నమ్మకంతో ఉన్నారు. మైత్రి సైతం లవ్ స్టోరీ అని చూడకుండా ప్రమోషన్ల కోసం బోలెడు డబ్బులు ఖర్చు పెడుతోంది. మ్యూజికల్ గా ఆల్బమ్ క్లిక్ అయితే అధిక సందర్భాల్లో పాజిటివ్ ఫలితమే వస్తుంది.