దసరాకు దిల్ రాజు డబుల్ ధమాకా

నిర్మాతగా ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఆపలేదు దిల్ రాజు. ఓవైపు గ్యాప్ లేకుండా పెద్ద సినిమాలు నిర్మిస్తూనే.. ఇంకోవైపు నైజాం ఏరియాలో తరచుగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు రాజు. అలా అని ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమాను పంపిణీ చేయడు. ఏది వర్కవుట్ అవుతుందో సరిగ్గా అంచనా వేసి హక్కులు తీసుకుంటూ ఉంటాడు. చాలా వరకు ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుంటుంది.

తాజాగా రాజుకు ‘జైలర్’ రూపంలో జాక్‌పాట్ దక్కింది. రజినీ గత సినిమాల ప్రభావం వల్ల ‘జైలర్’ రైట్స్ తక్కువ మొత్తానికే అమ్మారు. పెట్టుబడి మీద ఈ చిత్రం మూడు రెట్ల దాకా ఆదాయం తెచ్చిపెడుతుండటం విశేషం. ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లో రాజు నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. దసరాకు ఆయన ఒకేసారి రెండు సినిమాలను నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తుండటం విశేషం.

ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ను ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నాడు రాజు. దీంతో పాటుగా ‘లియో’ రైట్స్ కూడా నైజాం వరకు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ‘లియో’ తెలుగు హక్కులను హోల్‌సేల్‌గా సితార సంస్థ తీసుకుంది. వారి నుంచి నైజాం రైట్స్‌ను మారు బేరానికి రాజు తీసుకున్నట్లు సమాచారం.

ఒకే సీజన్లో రెండు క్రేజీ సినిమాలను ఒకే పంపిణీ సంస్థ రిలీజ్ చేయడం విశేషమే. కానీ రాజుకు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ సంక్రాంతి టైంలో ఇలా చేశాడు. ‘భగవంత్ కేసరి’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. ఇప్పుడు బాలయ్య టైం నడుస్తోందని రాజుకు అర్థమై మంచి రేటు పెట్టి రైట్స్ తీసుకున్నాడు. అలాగే విజయ్‌కి తెలుగులో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో ‘లియో’ రైట్స్‌కు కూడా ఫ్యాన్సీ రేటే ఇచ్చారట రాజు. మరి దసరాకు రాజు డిస్ట్రిబ్యూటర్‌గా డబుల్ ధమాకా కొడతారేమో చూడాలి.