ధనుష్-కమ్ముల సినిమాలో క్రేజీ హీరోయిన్

ఈ ఏడాదే ‘సార్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు ధనుష్. అతడికి చాలా ఏళ్ల నుంచి తెలుగులో మంచి ఫాలోయింగే ఉన్నప్పటికీ.. స్ట్రెయిట్ మూవీ చేయడంతో మరింతగా మన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ధనుష్ తర్వాతి చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ మీద తెలుగులో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీని తర్వాత ఈ తమిళ స్టార్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా అనౌన్స్ అయి రెండేళ్లు అవుతోంది కానీ.. ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు. స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ విషయంలో కమ్ముల చాలా టైం తీసుకుంటాడన్న సంగతి తెలిసిందే. అందులోనూ ధనుష్‌తో చేయబోయేది పాన్ ఇండియా మూవీ కావడంతో మరింత సమయం పడుతోంది. చాన్నాళ్లుగా వార్తల్లో లేని ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

ధనుష్-శేఖర్ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా ఎంపికైంది. ఈ కన్నడ అమ్మాయికి తెలుగులోనే కాక కన్నడ, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి క్రేజీ హీరోయిన్ ధనుష్ సినిమాలోకి వచ్చిందంటే హైప్ మరింత పెరగడం ఖాయం. ధనుష్‌కు ఆమె సరైన జోడీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కమ్ములతో ‘లవ్ స్టోరీ’ తీసిన ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.

ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని.. కమ్ముల ఇప్పటిదాకా తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. తొలిసారి యాక్షన్ టచ్ ఉన్న సినిమా తీస్తుండటంతో దీన్ని కమ్ముల ఎలా డీల్ చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ధనుష్ ఓకే చేశాడు అంటే ఈ కథ ప్రత్యేకంగా ఉంటుందనే భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు.