‘ఆచార్య’ అప్‌డేట్‌పై దోబూచులాట

మెగాస్టార్ చిరంజీవి అభిమానులిప్పుడు ఉత్కంఠతో ఊగిపోతున్నారు. చిరు పుట్టిన రోజుకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉంది. ఈసారి ఆయన పుట్టిన రోజుకు హంగామా మామూలుగా ఉండదని సంకేతాలందుతున్నాయి.

వివిధ సినీ పరిశ్రమల నుంచి 65 మంది ఫిలిం సెలబ్రెటీలతో చిరు పుట్టిన రోజు కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తునే వేడుకలు చేయడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆగస్టు 22న చిరు కొత్త సినిమాల ముచ్చట్లు సందడి చేయబోతున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘ఆచార్య’ నుంచి అభిమానుల్ని అలరించే అప్ డేట్ వస్తుందంటున్నారు. అలాగే చిరు చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా అధికారికంగా వెల్లడిస్తారట.

‘ఆచార్య’ విషయంలో అప్ డేట్ ఏంటన్నదే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న విషయం. టైటిల్ అధికారికంగా ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా లేదా టీజర్ లాంటిదేమైనా ప్లాన్ చేశారా అన్నది తెలియదు. కానీ అప్ డేట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

ఈ సినిమా పట్టాలెక్కి పది నెలలు దాటిన నేపథ్యంలో కచ్చితంగా అప్ డేట్ ఇవ్వాల్సిందే. దీని గురించి ‘ఆచార్య’ నిర్మాణ భాగస్వామి అయిన ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ కూడా ట్విట్టర్లో అభిమానులతో దోబూచులాట ఆడుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాలకు ఆ సంస్థ ఒక ట్వీట్ వేసింది.

‘మాకు ఈ నంబర్ అంటే ఎంతో ఇష్టం’ అని కిందికి చూపిస్తున్న సింబల్ ఉంది ఆ ట్వీట్లో. కింద టైమ్ 1.52 చూపిస్తోంది. ‘ఆచార్య’ చిరు 152వ సినిమా అన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చిరు పుట్టిన రోజున ‘ఆచార్య’ అప్ డేట్ కచ్చితంగా ఉంటుందన్న సంకేతాలు అందుతున్నాయి.