డిజాస్టర్ డైరెక్టర్‌పై ఎంత నమ్మకమో..

మెగా ఫ్యామిలీని.. ఆ ఫ్యామిలీ హీరోల అభిమానులను ఒక కలవరపాటుకు గురి చేసి చాలా ఏళ్ల పాటు వెంటాడిన సినిమా ‘ఆరెంజ్’. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్‌ నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. ఆడియో బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా గురించి ఏదో ఊహించుకున్నారు ఫ్యాన్స్.

కానీ వారి అంచనాలకు భిన్నంగా క్లాస్‌గా, స్లోగా, బోరింగ్‌గా సాగడంతో సినిమా మెజారిటీ జనాలకు రుచించలేదు. ఫ్యాన్స్‌కు అయితే అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చరణ్‌ కెరీర్‌కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిందీ సినిమా. ఈ చిత్రం వల్లే నాగబాబు తీవ్రంగా నష్టపోయి.. ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసినట్లు స్వయంగా వెల్లడించాడు. మరి ఇలాంటి ఫలితాన్నందుకున్న సినిమా దర్శకుడి పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టం కాదు.

‘ఆరెంజ్’ దెబ్బకు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మసకబారి.. చాలా ఏళ్లు కనిపించకుండా పోయాడు. దీని తర్వాత పదేళ్ల వ్యవధిలో అతను తీసింది ఒక్క ‘ఒంగోలు గిత్త’ మాత్రమే. ఆ సినిమా తర్వాత అంతర్ధానం అయిపోయిన భాస్కర్‌ను పిలిచి సినిమా చేయించింది అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిన దర్శకుడిపై నమ్మకం పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేయించారు. అది ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది.

అయినా భాస్కర్‌ మీద అరవింద్ నమ్మకం సడలిపోలేదు. తిరిగి గీతా ఆర్ట్స్ బేనర్లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కన్ఫమ్ అయ్యాడు. గురువారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈసారి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నాడట భాస్కర్. సిద్ధు లాంటి ఫామ్‌లో ఉన్న హీరో దొరకడం భాస్కర్‌కు కలిసొచ్చే అంశం. మరి భాస్కర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమేర నెరవేరుస్తాడో చూడాలి.