థియేటర్ల సర్దుబాటు గురించి దిల్ రాజు

ఇవాళ విడుదలైన రజనీకాంత్ జైలర్ కు ఎక్కువ థియేటర్లు వచ్చాయని, దీని వల్ల రేపు రిలీజ్ కాబోతున్న భోళా శంకర్ కు సరైన రీతిలో స్క్రీన్లు ఇవ్వలేదనే ఫిర్యాదు మెగా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. పైగా రజని మూవీకి టాక్ ఎలా ఉన్నా ఆక్యుపెన్సీలు మాత్రం చాలా బాగా నమోదయ్యాయి. దీంతో సక్సెస్ అయిన ఆనందాన్ని ఈ సినిమా పంపిణి చేసిన దిల్ రాజు, సునీల్ నారంగ్ లు కలిసి అభిమానులు, మీడియాతో పంచుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే రెండు సినిమాలకు సంబంధించిన సర్దుబాటు గురించి స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు.

జైలర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందని, మ్యాట్నీ నుంచి షోలు పెరిగాయని, అయితే భోళా శంకర్ కు ముందస్తుగానే సరిపడా స్క్రీన్లు కేటాయించడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదని, ఆగస్ట్ 15 దాకా అవి కొనసాగుతాయని, ఆ తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ని బట్టి ఎవరికి ఎక్కువ ఇవ్వాలో డిసైడ్ అవుతుందని చెప్పారు. మొన్న జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు సమానంగా డబ్బింగ్ మూవీ వారసుడుకి ఫేవర్ చేశారని కామెంట్స్ ఎదురుకున్న దిల్ రాజు ఈసారి తాను జైలర్ కు నిర్మాత కాకపోయినా డిస్ట్రిబ్యూటర్ గా అనుమానాలు తొలగించేందుకు చూశారు.

లాంగ్ వీకెండ్ తో పాటు ఇండిపెండెన్స్ డే కూడా మెగా మూవీకే అనుకూలంగా ఉంటుందని చెప్పారు కాబట్టి వాస్తవంగా అలా ఉందో లేదో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. బజ్ పరంగా కొంత వెనుకబడినట్టు కనిపిస్తున్నప్పటికీ భోళా శంకర్ టాక్ తోనే నిలబడుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తెల్లవారక ముందే వేసే బెనిఫిట్ షోలు ఈసారి పవన్, చిరంజీవి ఇద్దరికీ దూరం కావడం వాళ్ళకు అసంతృప్తి కలిగిస్తున్నా హిట్ కొడితే అదే చాలని కోరుకుంటున్నారు. ఈరోజు మినహాయిస్తే జైలర్ రేపటి నుంచి ఎలా హోల్డ్ అవుతుందనే దాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.