రాంగ్ టైంలో టార్గెట్ అయిన చిరు

వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో చిరంజీవి ప్రజా సమస్యలను పట్టించుకోమని, ఇండస్ట్రీని లక్ష్యంగా పెట్టుకోవద్దని చెప్పిన తీరు రివర్స్ లో ఆయన్నే ఏపీ అధికార పార్టీకి లక్ష్యంగా మారేలా చేసింది. ఒక్క పోలవరం తప్ప ఇంకే అంశం గురించి నేరుగా ఆంధ్రప్రదేశ్ అని కానీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అని కానీ ప్రస్తావించని చిరు మాటలకు ప్రతిగా ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులంతా ఒకప్పుడు చిరు మీద ఎంతో గౌరవం ప్రదర్శించిన వాళ్లే. ఇప్పుడు ఒక్కసారిగా విమర్శల దండకం అందుకుంటున్నారు.

నిజానికి చిరంజీవి దారుణమైన వ్యాఖ్యలు కానీ అభ్యంతరకర పదాలు కానీ వాడలేదు. కొంచెం సున్నితంగానే తన మనసులో మాట చెప్పారు. ఇంత ముప్పేట దాడి బహుశా ఊహించి ఉండరు. భోళా శంకర్ విడుదలను రెండు రోజుల్లో పెట్టుకుని ఇలా జరగడం వల్ల ఆ సినిమా మీద నెగటివ్ క్యాంపైన్ జరుగుతుందనే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఒకవేళ డివైడ్ టాక్ వచ్చినా దాన్ని ప్రతికూలంగా వాడుకుంటారని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటిదాకా స్పందించింది ఇద్దరు ముగ్గురు ప్రజా ప్రతినిధులే. గంటల వ్యవధిలో ఇది పదుల సంఖ్యకు చేరినా ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

ఒకవేళ మాములు టైంలో ఇలాంటిది జరిగి ఉంటే ఏమో కానీ భోళా శంకర్ లాంటి పెద్ద మూవీ ముంగిట కావడం ఊహించని పరిణామమే. బ్రోకు ఎదురైనా పవన్ కళ్యాణ్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రత్యర్థుల మాటల దాడి అలవాటైపోయింది. సందర్భం చూసి దానికి బదులు ఘాటుగానే ఇస్తున్నారు. కానీ చిరంజీవి రాజకీయాల్లో లేరు. అన్నింటికి వివరణ ఇస్తూ ఉండలేరు. మౌనం వహిస్తారు కానీ ఫ్యాన్స్ అలా కాదుగా. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య దీని గురించిన చర్చ వేడిగానే ఉంది.