బృందావన్ కాలనీకి ఎగబడటం ఖాయం

రీరిలీజుల ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నామధ్య తగ్గిపోయింది జనానికి విసుగొచ్చిందనుకున్న టైంలో ఒక్కసారిగా ఆరంజ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాత నాగబాబుతో సహా ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. తాజాగా బిజినెస్ మెన్ కు జరుగుతున్న రచ్చ చూస్తుంటే రిలీజవుతోంది గుంటూరు కారమేమో అన్నంతగా ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడుంబా శంకర్ కు ఇంతకు మించి రచ్చ చూపిస్తామని పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయ్యారు. రికార్డుల మేనియా ఆ స్థాయిలో ఉంది.

ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో 7జి బృందావన్ కాలనీ చేరింది. ప్రస్తుతం 4కె పనులతో పాటు డాల్బీ అట్మొస్ మిక్సింగ్ జరుగుతోంది. అక్టోబర్  విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దసరా పోటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద సినిమాలు లేని టైంలో దించేందుకు నిర్మాత ఏఎం రత్నం ప్లానింగ్ లో ఉన్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ కల్ట్ క్లాసిక్ కు మాములు ఫాలోయింగ్ లేదు. హీరో రవికృష్ణ కేవలం ఈ ఒక్క మూవీతోనే యూత్ లో అలా ముద్రపడిపోయాడు. సోనియా అగర్వాల్ కు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక యువన్ శంకర్ రాజా పాటలకు ఈ రోజుకీ తిరుగు లేదు.

ఈ వార్త రావడం ఆలస్యం డిస్ట్రిబ్యూటర్లు రత్నంని ఆఫర్లతో ఉక్కిరిబిక్కరి చేస్తున్నారట. ధనుష్ 3నే ఆ స్థాయిలో ఆదరించినప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కి కనీసం వారం రోజులు థియేటర్లు కిక్కిరిసిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టే ఎంత రేట్ అయినా సరే సిద్ధమని చెబుతున్నారట. నిజంగా దీనికున్న క్రేజ్ అలాంటిది. కామెడీ, లవ్, మ్యూజిక్, ఎమోషన్స్ తో పాటు సరిపడా రొమాన్స్ కూడా ఇందులో జొప్పించారు. అందుకే మూడు గంటల నిడివిని సైతం అప్పటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. స్టార్ హీరో లేని రీ రిలీజుల్లో ఇది కొత్త రికార్డులు సృష్టించడం పక్కానే.