శతమానం భవతి దర్శకుడి కష్టాలు

శతమానం భవతి.. టాలీవుడ్లో అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చిన కుటుంబ కథా చిత్రాల్లో ఇదొకటి. ఒకప్పుడు దిల్ రాజు సంస్థ నుంచి వచ్చిన ‘బొమ్మరిల్లు’ ఎలా అయితే ఫ్యామిలీస్‌ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించిందో.. ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం కూడాా కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లను కళకళలాడించింది. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాల పోటీని తట్టుకుని అప్పట్లోనే రూ.35 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇది. ‘శతమానం భవతి’ తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలతో నిరాశ పరిచిన సతీష్ మీద ప్రేక్షకులకు నమ్మకం పోయింది. వరుసగా రెండు ఫెయిల్యూర్లకు తోడు కొత్తగా మొదలుపెట్టిన సినిమాలు కూడా ముందుకు కదలక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు సతీష్. ఆల్రెడీ శ్రీహరి కొడుకుని, తన కొడుకుని హీరోలుగా పరిచయం చేస్తూ సతీష్ తీసిన ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ పూర్తి చేసుకుని కూడా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.

దీని తర్వాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే సినిమా మొదలుపెడితే దానికి మధ్యలో బ్రేక్ పడింది. నితిన్‌ ఈ మధ్యే ఇంకో కొత్త సినిమా ఏదో మొదలుపెట్టాడు. సతీష్‌తో చేస్తున్న సినిమా సంగతి అతీ గతీ లేకుండా పోయింది. ఈ రెండు చిత్రాల సంగతి తేల్చకుండా కొత్తగా ‘కథాకేళి’ అంటూ మరో కొత్త సినిమాను మొదలుపెట్టాడు సతీష్. తనకు మంచి పేరు, డిమాండ్ తెచ్చిపెట్టిన ‘శతమానం భవతి’ సినిమా పేరుతోనే బేనర్ మొదలుపెట్టి అందులోనే ‘కథాకేళి’ సినిమా చేస్తున్నాడు.

ఇందులో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి వాళ్లను పిలిపించుకుని సినిమా గురించి మంచి మాటలు చెప్పించాడు సతీష్. ఈ సందర్భంగానే కోతికొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు ఆలస్యమవుతున్న విషయం కూడా చెప్పాడు. మరి ఆ సినిమాల సంగతేమవుతుందో.. ‘కథాకేళి’ని అయినా సతీష్ విజయవంతంగా బయటికి తీసుకొస్తాడో లేదో చూడాలి.