బండ్ల గణేష్ రాలేదు హైపర్ ఆది తీర్చేశాడు

నిన్న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన వేడుక వల్ల చిరంజీవి ప్రసంగం మొదలుపెట్టే టైంకే  రాత్రి పది దాటేసింది. వర్షాలు గట్రా లేకపోవడంతో వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వచ్చిన అతిథులు, కాస్ట్ అండ్ క్రూ అందరూ ఓ రేంజ్ లో చిరు మీద పొగడ్తల వర్షం కురిపించారు. చిన్న వేషం వేసిన లోబో దగ్గరి నుంచి కీర్తి సురేష్ దాకా ఎవరూ మినహాయింపుగా నిలవలేదు. అయితే అందరికంటే ఎక్కువ హైలైట్ అయ్యింది మాత్రం హైప్ ఆదినే. సుమారు పావు గంట ఆడిటోరియంని ఊపేశాడు. బండ్ల గణేష్ రాని లోటుని మరిపించేశాడు

చిరంజీవి కెరీర్ ప్రారంభంలో జరిగిన అవమానాలతో మొదలుపెట్టి కోటి రూపాయల తీసుకున్న తొలి హీరో వరకు పేరు తెచ్చుకోవడం దాకా, ఫస్ట్ పది కోట్ల సినిమా ఘరానా మొగుడు ప్రస్తావం తేవడం, రంగస్థలంతో రామ్ చరణ్ అందరి విమర్శలకు సమాధానం చెప్పి గ్లోబల్ స్టార్ గా ఎదగడం ఇలా అన్ని అంశాలను తీసుకొచ్చాడు. ఠాగూర్ లో అన్నయ్యకి నచ్చని పదం క్షమించడం అయితే, నిజ జీవితంలో అందరిని క్షమించడమే పనిగా పెట్టుకున్నారని ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. చిరుని ఎవరేమైనా భరిస్తాడని అయితే తమ్ముడు పవన్ మాత్రం అందరి లెక్క తేలుస్తాడని చెప్పి ఈలలతో మోతెక్కించాడు.

మొత్తానికి చిరంజీవిని ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేయడం ఆదికే సాధ్యమయ్యింది. పక్కనే కూర్చున్న అల్లు అరవింద్ సైతం ఆశ్చర్యపోతూ స్పీచ్ వినడం గమనార్హం. సోషల్ మీడియాలో మాత్రం బండ్ల గణేష్ లేని లోటు ఇప్పుడు హైపర్ ఆదితో తీరుతోందని, గూస్ బంప్స్ ఇచ్చేలా ఎలా మాట్లాడాలో ఈ ఇద్దరి తర్వాతే ఎవరైనా అంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారు. భోళా శంకర్ లో కమెడియన్ బ్యాచ్ లో ముఖ్యమైన పాత్ర వేసిన హైపర్ ఆదికి ఈ దెబ్బతో మెగాస్టార్ ఏ మూవీ అయినా సరే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని వేరే చెప్పాలా. మొత్తానికి తనలో మెగా ఫ్యానిజంని ఓ రేంజ్ లో బయటపెట్టుకున్నాడు