అనుష్క ఆగమనం ఆ రోజే..

లేడీ సూపర్ స్టార్ అనుష్కకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. విజయశాంతి తర్వాత అలాంటి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది అనుష్కనే. ఐతే ఆమె తన అభిమానులను కొన్నేళ్ల నుంచి సంతృప్తిపరచట్లేదు. ‘బాహుబలి’ తర్వాత ఆమె కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. అదే.. నిశ్శబ్దం. ఆ సినిమా కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఆ తర్వాత ఆమె చాలా గ్యాప్ తీసుకుని సినిమాలకు దాదాపు దూరమైనట్లు కనిపించింది. కానీ గత ఏడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి సైలెంట్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను మొదలుపెట్టి అభిమానులకు ఉపశమనాన్ని ఇచ్చింది. ఇది మామూలు సినిమానే అయినా.. మేకింగ్‌కు చాలా టైమే పట్టింది. రిలీజ్ కూడా బాగా ఆలస్యం అయింది. ఆగస్టు 4న రిలీజ్ అనుకున్నారు కానీ.. చివరి నిమిషంలో మళ్లీ వాయిదా తప్పలేదు.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా చూపించారు కానీ.. ఆగస్టు 4ను సరైన డేట్‌గా భావించలేదని.. అందుకే వాయిదా అని గుసగుసలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి రిలీజ్ డేట్ కన్ఫమ్ అయిపోయిందట. ఆగస్టు 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి టీం ఫిక్స్ అయిందట. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు ప్రకటన కూడా వస్తుందట.

నవీన్ పొలిశెట్టి మళ్లీ ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగనున్నాడట. వచ్చే వారాంతంలో ‘జైలర్’, ‘భోళాశంకర్’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ వీకెండ్ అయ్యాక ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రమోషన్లను గట్టిగా చేయబోతున్నారని.. అనుష్క కూడా అందులో భాగం అవుతుందని.. 18న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే వీకెండ్లో దీనికి పోటీగా ఒకట్రెండు చిన్న సినిమాలు వచ్చే అవకాశముంది.