కోట బొమ్మాళి ఎందుకు చేతులు మారిందంటే

నిన్న గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అధికారికంగా ప్రకటించిన కోట బొమ్మాళి పీఎస్ మలయాళం సూపర్ హిట్ నాయట్టు రీమేకన్న సంగతి తెలిసిందే. నిజానికి దీని హక్కులు ఎప్పుడో కొన్నా అల్లు అరవింద్ నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ వచ్చారు. ముందు  అనుకున్న క్యాస్టింగ్ రావు రమేష్, ప్రియదర్శి, అంజలి. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ఈ తారాగణంతో థియేట్రికల్ గా కంటెంట్ ని మార్కెట్ చేయడం కష్టం. అందుకే కరుణ కుమార్ వేరే స్క్రిప్ట్ తో మట్కా రాసుకుని వరుణ్ తేజ్ తో సూపర్ ప్రమోషన్ అనిపించుకునే ప్రాజెక్ట్ అందుకున్నాడు.

అయితే నాయట్టు మీద అరవింద్ కు బోలెడు గురి ఉంది. ఎలాగైనా దీన్ని తెరకెక్కించాలనే సంకల్పంతో  ఉన్నారు. అవసరమైతే ఓటిటిలో అయినా మంచి డీల్ వచ్చేలా సెట్ చేసే ఉద్దేశంతో తన ఆహాకే జోహార్ ఇచ్చిన తేజ మర్నిని రంగంలోకి దింపు కోట బొమ్మాళిగా అవసరమైన మార్పులు చేర్పులతో కొత్త హంగులు జోడించారు. పైన చెప్పిన నటీనటుల స్థానంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చి చేరారు. దీంతో ఇప్పుడీ లైనప్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. జనాన్ని ఆకట్టుకునేలా టైటిల్, పోస్టర్ ని సిద్ధం చేసి వదిలారు.

అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కున్న పోలీస్ ఆఫీసర్లు తమ స్వంత డిపార్ట్ మెంట్, రౌడీ మూకల నుంచి తప్పించుకునే పాయింట్ తో నాయట్టు రూపొందింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కేరళలో సూపర్ హిట్ దక్కింది. అప్పటి నుంచే గీతా ఆర్ట్స్ దీన్ని తెలుగులో అందించాలనే పట్టుదలతో ఉంది. ఎట్టకేలకు ఇలా కార్యరూపం దాల్చింది. కాకపోతే ఆలస్యమైన మాట వాస్తవమే కానీ స్టార్ హీరో చేయడం లేదు కాబట్టి హడావిడిగా ఒరిజినల్ చూసేందుకు మన ఆడియన్స్ పరుగులు పెట్టేంత సీన్ ఉండదు. విడుదల ఎప్పుడు వగైరా అప్డేట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి.