ఆ దర్శకుడిది ఒక సినిమా మెరుపేనా?

‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడు సతీశ్ వేగేశ్న ఎంత మంచి పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాలతో పోటీ పడి ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే అందుకున్న ఆ చిత్రం.. జాతీయ అవార్డు సైతం అందుకుంది.

ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు మూడేళ్లు తిరిగేసరికి రెండు పేలవమైన సినిమాలతో తెచ్చుకున్న పేరంతా పోగొట్టుకున్నాడు. ‘శతమానం భవతి’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ మరో ‘బ్రహ్మోత్సవం’లా అనిపిస్తే.. ఆ తర్వాత వచ్చిన ‘ఎంతమంచివాడవురా’ ప్రేక్షకులను టార్చర్ పెట్టేసింది.

‘శతమానం భవతి’ కంటే ముందు సతీశ్.. రామదండు, దొంగలబండి అనే సినిమాలు తీశాడు. అవి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ‘శతమానం భవతి’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా తర్వాత ట్రాక్ తప్పాడు. చివరికిప్పుడు తన కొడుకు సమీర్ వేగేశ్న, ‘రాజ్‌దూత్’తో పరిచయమైన శ్రీహరి కొడుకు మేఘాంశ్‌లను హీరోలుగా పెట్టి ఏదో కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నట్లు మీడియాకు వెల్లడించాడు. ఈ సినిమాపై జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందన్నది సందేహమే.

‘శతమానం’ భవతితో స్టార్ డైరెక్టర్ అయిపోతాడని.. స్టార్లను డీల్ చేస్తాడని అనుకుంటే.. ఇలాంటి స్థితికి వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం, ఆ తర్వాత అంచనాలు అందుకోవడం కష్టం అనడానికి సతీశ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉండగా సతీశ్ నిర్మాతగా మారి అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘నాంది’ కొంత ఆశలు రేకెత్తిస్తోంది.