సెన్సారు బోర్డు ముందే చూసుకోలేదా  

విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన హాలీవుడ్ మూవీ ఓపెన్ హెయిమర్ కు ఇండియాలో మంచి స్పందనే దక్కింది. ప్రపంచమంతా బార్బీకి ఓటేస్తే మనోళ్లు మాత్రం క్రిస్టోఫర్ నోలన్ మీద అభిమానాన్ని కోట్ల రూపాయల వసూళ్ల రూపంలో ప్రదర్శించారు. అయితే ఒక అభ్యంతకర సన్నివేశంలో ఓ పాత్ర భగవద్గీత శ్లోకాన్ని చెప్పడం వివాదానికి దారి తీసింది. రిలీజైన తొలి రోజుల్లో ఆడియన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చాలా మంది అర్థం కాకపోవడంతో లైట్ తీసుకున్నారు. కానీ క్రమంగా ఆ సీన్లోని ఉద్దేశం అర్థం చేసుకుని భగ్గుమనడంతో వ్యవహారం కేంద్రం దాకా వెళ్ళింది.

సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీని పట్ల తీవ్రంగానే స్పందించారు. దీన్ని తక్షణం తొలగించాలని, అసలు ఇంత నిర్లక్ష్యంగా సర్టిఫికెట్ ఇచ్చిన అధికారుల నుంచి వివరణ కోరడంతో పాటు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజానికి సెన్సార్ బోర్డు ఆఫీసర్లకు ఎలాంటి అభ్యంతరమైనా సరే చెప్పే అధికారం ఉంటుంది. గతంలో కఠినంగా ఉంటూ ఎన్నో సినిమాల రిలీజుల విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించిన సందర్భాలు బోలెడు. కానీ నోలన్ అనగానే ఆయన తీసేదంతా గొప్పనే భావనలో పట్టించుకోలేదో లేక ఎవరు అడుగుతారనే నిర్లిప్తతో అంతు చిక్కడం లేదు.

దీని మీద ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు ఈ ధోరణి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరొకొందరు పడక గదుల్లో దేవుడి పటాలు పెట్టుకోగా లేనిది ఇది మాత్రం తప్పెలా అవుతుందని విచిత్రమైన లాజిక్స్ తీస్తున్నారు . ఒక లేడీ ఆర్టిస్టు నగ్న సన్నివేశాన్ని సిజిలో నల్ల డ్రెస్సు వేసుకున్నట్టు మార్చడం తప్ప ఓపెన్ హెయిమర్ కు సంబంధించి సెన్సార్ పెద్దగా అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఇప్పుడీ వివాదం వల్ల కట్స్ ఏమైనా పడతాయేమో చూడాలి. అయినా మొదటి మూడు రోజుల హడావిడి తర్వాత ఈ సినిమా దూకుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడేం చేసినా పెద్దగా ప్రయోజనం లేనట్టే.