బ్రో కోసం తేజు.. ప‌ర్ఫెక్ట్ ఛాయిస్

మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలున్నారు. కానీ వాళ్ల‌లో చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్‌ల‌ను మిన‌హాయిస్తే  ఏ ఇద్ద‌రూ క‌లిసి పూర్తి స్థాయి సినిమా చేయ‌లేదు. ఆచార్య‌లో కూడా తండ్రీ కొడుకులిద్ద‌రూ క‌లిసి క‌నిపించేది కాసేపే. అందులో చ‌ర‌ణ్‌ది అతిథి పాత్ర‌. కానీ బ్రో సినిమాలో మాత్రం మామా అల్లుళ్ల‌యిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి పూర్తి స్థాయిలో న‌టించారు. ప‌వ‌న్‌ది ఇందులో అతిథి పాత్రేమీ కాదు.

సినిమాలో ఒక్క 15 నిమిషాలు మిన‌హా ఆయ‌న క‌నిపిస్తారు. తాజాగా రిలీజైన బ్రో ట్రైల‌ర్లో కూడా ప‌వ‌న్ బాగానే హైలైట్ అయ్యారు. తేజు కూడా మంచి హుషారుగా న‌టించిన‌ట్లున్నాడు ఈ సినిమాలో. ట్రైల‌ర్ ఆద్యంతం ఎంట‌ర్టైనింగ్‌గా క‌నిపించింది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ అదీ చూస్తే ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌డం విధి లిఖితం అనిపిస్తే ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. తేజునే ఆ పాత్ర‌కు ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అనిపిస్తోంది.

దాదాపు రెండేళ్ల కింద‌ట  తేజు రోడ్డు ప్ర‌మాదానికి గురై తీవ్రంగా గాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. త్రుటిలో అత‌ను ప్రాణాపాయం త‌ప్పించుకున్నాడు. దాన్ని త‌న‌కు పున‌ర్జ‌న్మ‌లా భావిస్తుంటాడు తేజు. ఆ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పాడు. బ్రో విష‌యానికి వ‌స్తే.. ఇందులోనూ హీరో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అందులో చ‌నిపోతాడు. కానీ దేవుడు అత‌డికి ఇంకో అవ‌కాశం ఇస్తాడు. పున‌ర్జ‌న్మ అన‌మాట‌.

సినిమాలో అదే కీల‌క‌మైన పాయింట్. రెండో అవ‌కాశాన్ని అత‌ను ఎలా ఉప‌యోగించుకుని త‌న జీవితాన్ని చ‌క్క‌దిద్దుకున్నాడ‌న్న‌దే ఈ క‌థ‌. తేజు ఈ పాత్ర చేయ‌డంతో అత‌డి నిజ జీవితంలో జ‌రిగిన విష‌యాలు అంద‌రికీ గుర్తుకు వ‌స్తున్నాయి. ఆ విష‌యంలో రేప్పొద్దున అంద‌రూ బాగా రిలేట్ అయ్యే అవ‌కాశం కూడా ఉంది. అందుకే తేజు ఈ పాత్ర చేయ‌డానికి ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. బ్రో ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.