ఆస్కార్ అవార్డులపై రాజమౌళికి అంత కోపమేంటి?

‘మగధీర’, ‘ఈగ’; ‘బాహుబలి’ సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించిన దర్శకుడు రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’ అనేక దేశాల్లో సంచలన వసూళ్లు సాధించి రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపు తెచ్చింది. రాజమౌళిని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఫాలో అవుతుంటారు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఆచితూచే మాట్లాడాలి.

వేరే సినిమాల గురించి స్పందించేటపుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐతే భాషా భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుని నాలుగు ఆస్కార్ అవార్డులు కూడా గెలిచిన ‘పారసైట్’ గురించి ఆయన ఈ మధ్య ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా తనకు బోర్ కొట్టించిందని.. మధ్యలో నిద్ర పోయానని అన్నారు. తనకు ఆ సినిమా నచ్చలేదంటే సరిపోయేది.

కానీ మధ్యలో నిద్రపోయాను అనే కామెంట్ చేసేసరికి చాలామంది హర్టయ్యారు. ప్రపంచం మెచ్చి.. ఆస్కార్ జ్యూరీ కూడా అబ్బురపడ్డ సినిమాను ఇంత తేలిగ్గా తీసిపడేయడమేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

దీనిపై ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి వివరణ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డు గెలిచిన సినిమా గురించి అలా ఎలా మాట్లాడారు అని జక్కన్నను అడిగితే..
‘‘పారసైట్ నచ్చకపోవడం అన్నది నా వ్యక్తిగత అభిరుచి. ఇక ఆస్కార్ జ్యూరీ ప్రమాణాలంటారా? అక్కడ కూడా లాబీయింగ్ చాలానే ఉంటుంది. మీ సినిమాను జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే ఉటుంది. అయినా సరే నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటిస్తుంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుంటుంది. ఎంత లాబీయింగ్ ఉన్నప్పటికీ చెత్త సినిమాను తీసుకెళ్లి పాస్ చేయించి అవార్డు తీసుకునే పరిస్థితి ఉండదంటారు. అదెలా జరుగుతుందనే విషయంలో నాకు పరిజ్ఞానం లేదు. గతంలో ఆస్కార్ సినిమాలు కొన్ని నాకు నచ్చాయి. కొన్ని నచ్చలేదు’’ అని చెప్పాడు.

ఐతే ఆస్కార్ జ్యూరీ లాబీయింగ్ గురించి రాజమౌళి చెప్పిన మాటలు వింటే వారి విషయంలో ఆయనకు సదభిప్రాయం లేనట్లుంది. ‘బాహుబలి’ గురించి ఎంతో చెప్పుకున్నప్పటికీ.. అదెంతా ఆదరరణ పొందినప్పటికీ.. ఇండియా నుంచి కూడా ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక కాని సంగతి తెలిసిందే.