తేజు షార్ట్ ఫిలిం

మెగాస్టార్ మేనల్లుడు, టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగానే గాయపడ్డాడు. దాని వల్ల అతను కొన్ని నెలలు ఆసుపత్రిలో.. ఉన్నాడు. కొన్ని నెలలు ఇంటి నుంచి కదల్లేదు. ఏడాది తర్వాత కానీ మళ్లీ షూటింగ్ లకు హాజరు కాలేదు. తర్వాత అతను ’విరూపాక్ష‘ సినిమాలో నటించాడు. అది ఈ వేసవిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.

ఇప్పుడు తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ’బ్రో‘తో ప్రేక్షకులను పలకరించడబోతున్నాడు తేజు. దీని తర్వాత తేజు ఏం చేస్తాడనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను సంపత్ నంది దర్శకత్వంలో నటించబోతున్నట్లు తేజు ధ్రువీకరించాడు. కానీ ఆ సినిమా మొదలు కావడానికి కొంచెం సమయం పడుతుందని తేజు చెప్పాడు.

యాక్సిడెంట్ కు సంబంధించి తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. ఒక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని.. మూణ్నాలుగు నెలలు పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉంటానని.. ఆ తర్వాతే సంపత్ నంది సినిమా ఉటుందని తేజు వెల్లడించాడు. కాగా తాను ఇప్పటికే ఒక షార్ట్ ఫిలింలో నటించినట్లు తేజు వెల్లడించడం విశేషం. నేరుగా ఫీచర్ ఫిలింతోనే హీరోగా మారిన తేజు.. ఇప్పటిదాకా ఎన్నడూ షార్ట్ ఫిలిం చేసింది లేదు.

మరి ఇప్పుడు తొలిసారిగా ఒక కొత్త దర్శకుడితో షార్ట్ ఫిలిం చేశాడంటే.. అది ఎలా ఉంటుందో చూడాలి. దాని వివరాలేంటి అని అడిగితే.. మీరే చూస్తారుగా అనేశాడు తేజు. ’చిత్రలహరి‘తో కథల ఎంపికలో తన తీరు మారిందని.. అక్కడ్నుంచి రొటీన్ సినిమాలు పక్కన పెట్టి వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు తేజు. ఐతే మాస్ సినిమాలకు పూర్తిగా దూరంకానని.. అప్పుడప్పుడూ ఒకటి చేస్తానని.. సంపత్ నందితో చేసేది అలాంటి సినిమానే అని తేజు తెలిపాడు.