సాయిపల్లవి స్టైలే వేరు

స్టార్ హీరోయిన్లు విహార యాత్ర అంటే ఏ స్విట్జర్జాండుకో లేదంటే మాల్దీవులకే వెళ్తుంటారు. అక్కడికెళ్లి బికినీలు వేసుకుని ఫొటోలు పెడుతుంటారు. ఐతే ఈ తరం హీరోయిన్లలో తాను చాలా భిన్నం అని.. తన సినిమాలతో ఎప్పుడూ చాటుతూ ఉండే విలక్షణ కథానాయిక సాయిపల్లవి మాత్రం.. ఈ వెకేషన్ టూర్ల విషయంలోనూ తన రూటే వేరని చాటి చెప్పింది. ఆమె సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్రను ఎన్నో కష్టాలకు, సవాళ్లకు ఓర్చి పూర్తి చేయడం విశేషం.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవాళ్లలో ఎక్కువగా పెద్దవాళ్లే ఉంటారు. యూత్ అంతగా కనిపించరు. కానీ సాయిపల్లవికి మాత్రం అమర్‌నాథ్ యాత్ర చేయాలని ఎప్పట్నుంచో కోరిక అట. ఆమె తన తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి ఈ యాత్రను పూర్తి చేసింది. యాత్రకు సంబంధించిన ఫొటోలు, విశేషాలతో ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు కూడా పెట్టింది. 

‘‘అమర్‌నాథ్ యాత్ర నా సంకల్ప శక్తిని సవాల్ చేసింది. నా ధైర్యాన్ని పరీక్షించింది. ఈ యాత్రకు వెళ్లాలన్నది ఎప్పట్నుంచో నాకున్న కోరిక. ఈసారి వీలు కుదిరింది. దీంతో అమ్మా నాన్నలను కూడా తీసుకెళ్లా. కానీ ఇది మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి కూడా తీసుకోలేకపోయారు. ఛాతీ పట్టుకుని ఆయాసపడ్డారు. మధ్యలోనే ఆగిపోయారు. దేవుడా.. నువ్వెందుకు అంత దూరంలో ఉన్నావు అని ప్రశ్నించాను ఆ టైంలో.

మేం తిరిగి వస్తున్నపుడు ఇలాగే చాలామంది పెద్దవాళ్లు ఇబ్బంది పడుతూ కనిపించారు. వాళ్లందరూ ఓం నమ:శివాయ అని బిగ్గరగా అరుస్తూ ముందుకు సాగారు. జీవితమే ఒక తీర్థ యాత్ర అనే భావన కలిగించింది లక్షలాది మంది భక్తులకు ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తున్న అమర్‌నాథ్ యాత్రకు ధన్యవాదాలు’’ అని సాయిపల్లవి చెప్పింది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ఏ సినిమా చేయట్లేదు. తమిళంలో మాత్రమే నటిస్తోంది.