థియేటర్ ఓనర్ల సాధ్యం కాని డిమాండ్లు

నిన్న తమిళనాడు థియేటర్ ఓనర్ల అసోసియేషన్ సమావేశమై పలు డిమాండ్లను కోలీవుడ్ నిర్మాతల ముందుంచింది. స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లు ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో నటించాలనేది అందులో మొదటిది. కొత్త చిత్రాలు ఏవైనా సరే ఎనిమిది వారాల తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ కి ఇవ్వడం, వాటి తాలూకు యాడ్స్ నెల రోజుల తర్వాతే వచ్చేలా డిజిటల్ కంపెనీలతో మాట్లాడ్డం, తాజా రిలీజులకు 60 శాతం షేర్, ఈవెంట్లకు పర్మిషన్లు ఇవ్వడం, కరెంటు తదితర బిల్లులను వీలైనంత త్వరగా తగ్గించడంతో పాటు టికెట్ రేట్లు పెంచడం మిగిలినవి

నిజానికి ఇవన్నీ ఆచరణలో అంత సులభంగా సాధ్యమయ్యే అవకాశం లేనివే. ఎందుకంటే స్టార్ హీరోలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేయాలనేది ప్రతిసారి వాళ్ళ చేతుల్లో ఉండదు. పరిస్థితుల ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఇక ఓటిటి గ్యాప్ కు సంబంధించిన నిబంధన పాటించాలంటే నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. గత ఏదేది టాలీవుడ్ లోనూ అలాంటి రిజల్యూషన్ తీసుకురావాలని ప్రయత్నించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాన్ని పటిష్టంగా అమలు చేయడంలో విఫలమయ్యింది. దీంతో ఎప్పటిలాగే రెండు వారాల నుంచి నెల రోజుల్లోపే ఓటిటిలో వస్తున్నాయి.

ఈసారి వీటి మీద గట్టిగా పోరాడాలని తమిళ ఎగ్జిబిటర్లు కంకణం కట్టుకున్నారు కానీ ప్రాక్టికల్ గా జరిగే పని కాదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం చేతుల్లో ఉన్న టికెట్ రేట్ల పెంపు తప్ప ఇంక దేనికి సంబంధించి ఆశలు పెట్టుకున్నా వృథానే అంటున్నారు. అక్కడ ఇప్పుడు మేల్కొన్నారు కానీ తెలుగులో ఎప్పటి నుంచో ఈ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా తర్వాత ఓటిటి మార్కెట్ విస్తృతంగా పెరిగిన తరుణంలో దానికి అనుగుణంగా నడుచుకోవడం తప్ప ప్రొడ్యూసర్లకు పెద్దగా ఆప్షన్లు ఉండటం లేదు. ఒకవేళ పైన చెప్పినవి నిజంగా చేయగలిగితే పక్క రాష్ట్రాల్లోనూ మార్పు చూడొచ్చు