అజిత్ మోస‌గాడు.. నిర్మాత ఆరోప‌ణ‌

త‌మిళ ఫిలిం ఇండ‌స్ట్రీలో టాప్ హీరోల్లో ఒక‌డైన అజిత్ కుమార్‌కు వివాద ర‌హితుడిగా పేరుంది. చాలామంది స్టార్ హీరోల్లా అత‌ను హ‌డావుడి చేయ‌డు. సినిమాల్లో న‌టించ‌డం.. ఇంటికి ప‌రిమితం కావ‌డం.. అంతే అన్న‌ట్లు ఉంటాడు. మీడియా ముందుకే రాడు. క‌నీసం త‌న సినిమాల ప్ర‌మోష‌న్ల‌లో కూడా క‌నిపించ‌డు. నిర్మాత‌ల‌కు అత్యంత స‌హ‌కారం అందించే హీరోగా కూడా అజిత్‌కు పేరుంది.

అలాంటి హీరో మీద మాణిక్యం నారాయ‌ణ‌న్ అనే సీనియ‌ర్ నిర్మాత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అంద‌రూ అనుకున్న‌ట్లు అజిత్ జెంటిల్‌మ్యాన్ కాద‌ని.. అత‌ను మోస‌గాడ‌ని.. త‌న‌ను మోసం చేశాడ‌ని మాణిక్యం ఆరోపించాడు. కొన్నేళ్ల ముందు త‌న త‌ల్లిదండ్రుల‌ను విదేశీ యాత్ర‌కు పంపించేందుకు గాను అజిత్ త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు తీసుకున్నాడ‌ని.. ఆ సంద‌ర్భంగా త‌న‌కు సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని.. తాను ఇచ్చిన డ‌బ్బునే రెమ్యూన‌రేష‌న్ అడ్వాన్సుగా తీసుకున్నట్లు తాను భావించాన‌ని మాణిక్యం తెలిపాడు.

కానీ అజిత్ త‌ర్వాత త‌నకు సినిమానే చేయ‌లేద‌ని.. డ‌బ్బు కూడా తిరిగి ఇవ్వ‌లేద‌ని మాణిక్యం ఆరోపించాడు. ఏళ్లు గ‌డుస్తున్నా ఈ డ‌బ్బు సంగ‌తే అజిత్ మాట్లాడ‌ట్లేదని.. 50 కోట్ల‌కు పైగా పారితోష‌కం తీసుకునే అజిత్‌కు ఇలా మోసం చేయ‌డం ఏంటి అని మాణిక్యం ప్ర‌శ్నించాడు. ఐతే గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్‌తో వేట్ట‌యాడు విల‌యాడు స‌హా కొన్ని పెద్ద సినిమాలు నిర్మించిన మాణిక్యం.. ఈ మ‌ధ్య అటెన్ష‌న్ కోసం, వార్త‌ల్లో నిలిచేందుకు ఇలాంటి పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్‌తో అట్లీ తీసిన జ‌వాన్ సినిమా త‌న నిర్మాణంలో వ‌చ్చిన పేర‌ర‌సుకు కాపీ అంటూ ఆ మ‌ధ్య ఆయ‌న కోర్టుకు ఎక్క‌డం గ‌మ‌నార్హం.