సమంత కన్ఫర్మేషన్ ఇచ్చేసింది

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆమె అభిమానుల్లో కొంత ఆందోళనకు కారణమైంది. గత ఏడాది మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడి తర్వాత కొంచెం కోలుకున్న సమంత.. మళ్లీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని.. ఆమెకు విశ్రాంతితో పాటు నిరవధిక చికిత్స అవసరం కావడంతో ఆరు నెలల నుంచి ఏడాది వరకు నటనకు దూరం కాబోతోందని ఈ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి.

సమంత వైపు నుంచి ఈ విషయంలో ఖండనలు కూడా ఏమీ లేవు. దీంతో ఈ ప్రచారం నిజమే కావచ్చని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ వార్తలను మరింత బలపరుస్తూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్టు పెట్టింది. ‘‘మరో మూడు రోజులు మాత్రమే ఉండేది. ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన అవసరముంది’’ అని సామ్ పేర్కొంది.

ఇంకో మూడు రోజులు మాత్రమే కారవాన్లో ఉండేది అని సమంత అందంటే.. ఆమె కొంత కాలం షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఐదారు నెలల నుంచి షూటింగ్‌ల్లో పాల్గొంటోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాను పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో సమంత పని పూర్తయినట్లే కనిపిస్తోంది.

దీంతో సామ్ కొత్తగా ఏ ప్రాజెక్టులూ ఒప్పుకోవట్లేదు. అంతకుముందు తీసుకున్న అడ్వాన్సులను కూడా ఆమె వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిగా చికిత్స, విశ్రాంతికే సమయం కేటాయించి.. మళ్లీ మునుపటి స్థితికి చేరాకే ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఐతే మరీ గ్యాప్ ఎక్కువ అయితే మాత్రం సమంతను అందరూ మరిచిపోయి ఆమె కెరీర్ ముగింపు దశకు చేరుకుంటుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నప్పటికీ అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో తన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు.