రామ్ మీద మోయలేని భారం

గత కొన్నేళ్లలో టాలీవుడ్ చూసిన అతి పెద్ద డిజాస్టర్లలో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందున్న హైప్‌తో భారీ రేట్లకు సినిమాను అమ్మి సొమ్ము చేసుకున్న నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్.. దారుణంగా నష్టపోయిన తమను  ఆదుకోవట్లేదని రిలీజ్ తర్వాత కొన్ని రోజుల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గొడవ చేస్తున్న సంగతి తెలిసిందే.

నెల ముందు కూడా బాధితులు నిరాహార దీక్షకు దిగారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ సహా పలువురు ప్రముఖులు వారికి అండగా నిలిచారు. వివాదం బాగా ముదరడంతో పూరి క్యాంప్ స్పందించక తప్పలేదు. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటామని ఛార్మి నుంచి హామీ రావడంతో బాధితులు ఆందోళనను విరమించారు.

కట్ చేస్తే.. ఇప్పుడు పూరి, ఛార్మి కలిసి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అదే ‘డబుల్ ఇస్మార్ట్’. ఎన్నో ఏళ్ల పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయిన పూరికి లైఫ్ లైన్ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది సీక్వెల్. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కావడం వల్లే ‘లైగర్’కు అంత బిజినెస్ జరిగింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తుంటే ఆశలు, అంచనాలు పెరుగుతున్నాయి. ‘లైగర్’ విషయంలో పూరి, ఛార్మిల మీద పడ్డ మరకలు ఏమీ చెరిగిపోలేదు.

ఆ నష్టాలకు సంబంధించి ఇప్పటికైతే వాళ్లిద్దరూ ఏ రకమైన సెటిల్మెంట్ చేయలేదని సమాచారం. వారితో పాటు ‘లైగర్’ బాధితులందరి ఆశలూ ‘డబుల్ ఇస్మార్ట్’ మీదే ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ అయి తీరాల్సిందే. ఈ సినిమాను ‘లైగర్’ బయ్యర్లకు కొంచెం తక్కువ రేట్లకు ఇచ్చి వారికి సెటిల్ చేయాలన్నది పూరి, ఛార్మిల ప్లాన్. ఆ కోణంలో చూస్తే సినిమా జస్ట్ హిట్టయినా కూడా పూరి, ఛార్మి బయటపడరు.

వాళ్లు ఇంకో సినిమా చేయాలంటే బయ్యర్ల సెటిల్మెంట్‌కు పోను డబ్బులు మిగలాలి. అలా జరగాలంటే సినిమా బ్లాక్ బస్టర్‌కు తక్కువ కాకూడదు. ‘ఇస్మార్ట్ శంకర్’కు ఆ టైంలో అన్నీ కలిసొచ్చి ఫ్లూక్‌లో అనుకున్న దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయిందనే అభిప్రాయం ఉంది. మరి ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే మార్చిలో ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో.. ఈ సినిమాను నమ్ముకున్న వారికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఏదేమైనా ఈ సినిమా రామ్ మీద మోయలేని భారాన్ని పెడుతోందన్నది మాత్రం వాస్తవం.