మిరపకాయ్ కలయిక మరొక్కసారి

మాస్ మహారాజా రవితేజ దూకుడు మాములుగా లేదు. ఇరవై ఏళ్ళ క్రితం కెరీర్ ఏ స్పీడ్ లో ఉండాలనుకున్నాడో ఇప్పుడు అంతకన్నా వేగంగా షూటింగులు చేస్తూ వరసబెట్టి కమిట్ మెంట్లు ఇస్తున్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మిరపకాయ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని నెలల క్రితం చెప్పిన లైన్ ఒక కావడంతో దాన్ని స్క్రిప్ట్ గా మార్చే బాధ్యతను త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

అసిస్టెంట్ డైరెక్టర్ గా, చిన్న ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన హరీష్ శంకర్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రవితేజనే. కానీ షాక్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తనకు పట్టున్న మాస్ ఎంటర్ టైన్మెంట్ కాకుండా రొటీన్ రివెంజ్ డ్రామా ఎంచుకోవడంతో పొరపాటు ఎక్కడ జరిగిందో హరీష్ కు అర్థమైపోయింది. అందుకే ఫ్లాప్ ఇచ్చినా సరే మిరపకాయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ రాజా. ఈసారి నమ్మకం వమ్ము కాలేదు. సూపర్ హిట్ పడింది. దాని వల్లే గబ్బర్ సింగ్ దక్కింది. చేసింది తక్కువ సినిమాలే అయినా హరీష్ శంకర్ కు మాస్ పల్స్ మీద మంచి అవగాహన ఉంది.

అందుకే పిలిచి మరీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లు పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజతో హరీష్ చేతులు కలపడం బహుశా వచ్చే జనవరి నుంచి ఉండొచ్చు. అనౌన్స్ మెంట్ ఇప్పుడే ఇచ్చినా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి టైం పట్టేలా ఉంది. క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తదితర పనులు పవన్ ప్రాజెక్టు నుంచి ఫ్రీ అయ్యాక చేసుకోవచ్చు. పై మూడు కాకుండా ఇంకో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ 2025 దాకా డైరీని బిజీగా ఉంచుకోబోతున్నాడు. ఇంత ప్లాన్డ్ గా ఉన్న స్టార్ హీరోలు రవితేజ తర్వాత నాని లాంటి వాళ్ళు తక్కువే.