అఫీషియల్ : AA త్రివిక్రమ్ అంతకు మించి  

గత కొద్దిరోజులుగా లీకుల రూపంలో తిరుగుతున్న అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ని అధికారికంగా ప్రకటించారు. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించబోతున్నాయి. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇంత తక్కువ గ్యాప్ తో ఈ కాంబో రిపీట్ కావడం అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. మహేష్ బాబుతో ప్రస్తుతం గుంటూరు కారం తీస్తున్న త్రివిక్రమ్ అది నవంబర్ లోపు పూర్తి చేసి బన్నీ తాలూకు స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంలో బిజీ అవుతారు. అటు పక్క పుష్ప 2తో ఐకాన్ స్టార్ కూడా యమా బిజీగా ఉన్నాడు.

జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములోతో హ్యాట్రిక్ సక్సెస్ లు పూర్తి చేసిన బన్నీ త్రివిక్రమ్ మరోసారి ఆ మేజిక్ ని రిపీట్ చేయబోతున్నారు. అయితే పైన మూడింటిలాగా రెగ్యులర్ కమర్షియల్ టచ్ లో ఉండదట. ప్యాన్ ఇండియా స్కేల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని వినికిడి. ఎంతనేది బయటికి రాలేదు కానీ రెండు నుంచి మూడు వందల కోట్ల మధ్య ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇన్ సైడ్ టాక్. గుంటూరు కారంతోనే నాన్ బాహుబలి రికార్డులు అందుకుంటామని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నిర్మాత నాగవంశీ ఈసారి ఇంకే స్థాయిలో ఊరిస్తారో చూడాలి.

సంగీత దర్శకుడిగా తమనే ఉండబోతున్నాడు. అధికారికంగా చెప్పనప్పటికీ ఈ రోజు అప్డేట్ ని నిన్న తన హ్యాండిల్ నుంచి కూడా ట్వీట్ చేయడంతో ఈ విషయంలో అనుమానం అక్కర్లేదు. త్రివిక్రమ్ కాంపౌండ్ తమన్ పనితనం పట్ల ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ ఎవరితో చేతులు కలుపుతాడనే సస్పెన్స్ కు మొత్తానికి చెక్ పడిపోయింది. గురూజీ కెరీర్ లో ఇప్పటిదాకా కేవలం ప్రొడక్షన్ కే వందల కోట్లు ఖర్చైన సినిమా లేదు. ఇది దానికి శ్రీకారం చుట్టబోతోంది. సుకుమార్ తరహాలో త్రివిక్రమ్ కూడా నేషనల్ మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు