రాజమౌళికి ఇష్టమైన ఫ్రాంచైజ్ నిరాశ పరిచింది  

హాలీవుడ్ మూవీస్ లో ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో రాజమౌళి కూడా ఉన్నారు. మహేష్ బాబుతో చేయబోయే గ్లోబల్ మూవీకి స్ఫూర్తి ఈ సినిమానే. అడవుల్లో నిధులు, నిక్షేపాల కోసం ప్రమాదకరమైన గుహలు, జంతువులను దాటుకుని హీరోలు విజయం సాధించడమనే ఎన్నో చిత్రాలు దీని నుంచి స్ఫూర్తి పొందినవే. చిరంజీవి అంజి లాంటి ఎన్నో టాలీవుడ్ మూవీస్ లో వీటి రిఫరెన్సులు చూడొచ్చు. 1981లో మొదలైన ఈ సిరీస్ లో ఇప్పటిదాకా నాలుగు సినిమాలు వచ్చాయి. మొదటి మూడు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్, టెంపుల్ అఫ్ డూమ్, లాస్ట్ క్రూసేడ్ గొప్ప విజయం సాధించాయి. 2008లో వచ్చిన కింగ్ డం అఫ్ ది క్రిస్టల్ స్కల్ ఒకటే వీటి స్థాయిలో సక్సెస్ కాకపోయినా కమర్షియల్ గా హిట్టయ్యింది. మొన్న శుక్రవారం అయిదోది వచ్చింది. డయల్ అఫ్ డెస్టినీ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని ఇండియానా జోన్స్ ఫైనల్ పార్ట్ గా ప్రమోట్ చేశారు. దీంతో సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎంత వయసైనా సరే హారిసన్ ఫోర్డ్ ఇందులో కూడా ఉత్సాహంగా నటించడంతో అభిమానులు చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఇది నిరాశపరిచే ఫలితాన్ని అందుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కాల ప్రయాణం చేసే ఒక డివైజ్ చుట్టూ దర్శకుడు జేమ్స్ మ్యాన్ గోల్డ్ దాన్ని చివరి దాకా ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఈజీగా ఊహించే మలుపులతో పాటు వయసైపోయిన హారిసన్ చేసే సాహసాలు అంత థ్రిల్లింగ్ గా లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా బాగుందని చెప్పడానికి అవి సరిపోలేదు. జక్కన్న ఇటీవలే హైదరాబాద్ లో దీని షో చూశారు. ఎలాగూ ఇండియానా జోన్స్ ముగిసిపోయింది కాబట్టి జక్కన్న మహేష్ ల కలయికలో రాబోతున్న ఈ జానర్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం ఖాయం.