‘ఆదిపురుష్’ డైలాగులపై ‘ఆదిపురుష్’ నటుడే..

‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత ఆ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలను ప్రెజెంట్ చేసిన విధానం.. అలాగే అందులోని డైలాగులపై తీవ్ర విమర్శలే వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు వచ్చినా.. ఇంకా వివాదాలు, విమర్శలు ఆగట్లేదు.

తాజాగా ‘ఆదిపురుష్’కు వ్యతిరేకంగా వేసిన ఓ పిటిషన్‌ను విచారిస్తూ అలాహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయి. జనాలు వెర్రివాళ్లనుకుంటున్నారా.. ఖురాన్ మీద ఇలాంటి సినిమా తీయగలరా అంటూ కోర్టు.. ఆదిపురుష్ టీంను తీవ్రంగా మందలించింది.

కాగా ఈ సినిమాలో డైలాగుల పై స్వయంగా అందులో నటించిన నటుడే అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ నటుడి పేరు లవీ పజ్నీ. ‘ఆదిపురుష్’లో అతను కుంభకర్ణుడి పాత్రలో కనిపించాడు. ద్వితీయార్ధంలో కొన్ని నిమిషాల పాటు ఈ పాత్ర కనిపిస్తుంది.

పంజాబీ నటుడైన లవీ పజ్నీ.. ‘ఆదిపురుష్’ డైలాగుల విషయంలో ఒక హిందువుగా తాను కూడా బాధ పడ్డట్లు వెల్లడించాడు. సినిమాలో నటించేటపుడే కొన్ని డైలాగులు అభ్యంతరకరంగా అనిపించాయని.. ఇక సినిమా చూస్తూ తాను మరి కొన్ని డైలాగుల విషయంలో బాధ పడ్డానని లవీ పజ్నీ తెలిపాడు.

సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందేనని, అందుకే తాను ఏమీ అనలేకపోయానన్నారు. సినిమా విడుదల తర్వాత అభ్యంతరాల మేరకు కొన్ని డైలాగులను మార్చినప్పటికీ ఒక హిందువుగా తాను చాలా బాధపడ్డానని లవీ పజ్నీ.

ప్రభాస్ సైతం ఈ సినిమా షూటింగ్ మధ్యలో మనం చేస్తోంది కరెక్టేనా అని దర్శకుడు ఓం రౌత్ దగ్గర ప్రస్తావిస్తే.. తనను నమ్మమని చెప్పి ఓం రౌత్ సినిమాను ముందుకు తీసుకెళ్లినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.