శ్రీ విష్ణు.. ఆ సినిమాకు ప్రీక్వెల్ చేస్తున్నాడట

టాలీవుడ్లో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. ఐతే ఈ మధ్య అతడి సినిమాలు కొన్ని తేడా కొట్టాయి. ఇప్పుడతను ‘సామజవరగమన’ అనే వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గురువారం ఈ సినిమా రిలీజవుతుండగా.. రెండు మూడు రోజుల ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. వాటికి మంచి స్పందనే వచ్చింది.

సినిమా పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతోంది. ఈ సినిమా సక్సెస్ మీద చాలా ధీమాగా ఉన్న శ్రీ విష్ణు.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన హిట్ సినిమాల్లో ఒకటైన ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ చేయబోతున్నట్లు అతను వెల్లడించాడు. మామూలుగా హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం మామూలే కానీ.. పూర్వ కథతో ప్రీక్వెల్ చేయడం అరుదే. 

కన్నడలో ‘కాంతార’కు కూడా ఇలాగే ప్రీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ‘రాజ రాజ చోర’ దర్శకుడు హాసిత్ గోలి.. ఆ కథను వెనుక నుంచి చెప్పబోతున్నాడు. ‘రాజ రాజ చోర’లో హీరో పైకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా నటిస్తూ.. తెర వెనుక మాత్రం దొంగతనాలు చేస్తుంటాడు. బహుశా హీరో దొంగ కావడానికి దారి తీసిన కారణాల మీద ‘రాజ రాజ చోర’ ప్రీక్వెల్ నడుస్తుందేమో.

మరోవైపు శ్రీ విష్ణు యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లో ఓ సినిమా చేస్తున్నాడట. దీనికి ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడట. మరి కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు శ్రీ విష్ణు చెప్పాడు. కెరీర్లో తనకు విలన్ పాత్రలు చేయాలని ఉందని.. కానీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ‘వీరభోగ వసంత రాయలు’, ‘తిప్పరా మీసం’ ఫ్లాప్ అయ్యాయని.. దీంతో విలన్ పాత్రలు తనకు సెట్ కావని అనిపించి వాటికి దూరంగా ఉన్నానని శ్రీ విష్ణు తెలిపాడు.