ఆదిపురుష్ టీంపై కోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు

ఆదిపురుష్‌.. ఈ మ‌ధ్య కాలంలో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన సినిమా. టీజ‌ర్ రిలీజైన‌పుడే ఈ సినిమా తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంది కానీ.. త‌ర్వాత ఎలాగోలా ఆ నెగెటివిటీని జ‌యించారు. రిలీజ్ ముంగిట మంచి బ‌జ్ తీసుకురాగ‌లిగారు. కానీ రిలీజ్ త‌ర్వాత సినిమా తీవ్రాతి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఈ సినిమాలో రావ‌ణుడు స‌హా వివిధ పాత్ర‌ల‌ను ప్రెజెంట్ చేసిన తీరు.. అనేక స‌న్నివేశాలు.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మయ్యాయి.

రామాయాణాన్ని చెడ‌గొట్టార‌నే చ‌ర్చ న‌డిచింది. వీకెండ్ వ‌ర‌కు స‌త్తా చాటిన ఈ చిత్రం ఆ త‌ర్వాత ఈ నెగెటివిటీని త‌ట్టుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డింది. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు కోర్టు కేసులు కూడా చిత్ర బృందానికి త‌ల‌పోటుగా మారాయి. ఈ సినిమా హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ అల‌హాబాద్ హైకోర్టులో కొంద‌రు పిటిష‌న్ వేశారు.

ఈ పిటిష‌న్ మీద విచారించిన కోర్టు.. ఆదిపురుష్ టీం మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌జ‌లు బుర్ర లేని వాళ్లు అనుకుంటున్నారా అంటూ మేక‌ర్స్ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇలాంటి సినిమా చూశాక కూడా ప్రజలు లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ రానివ్వలేదు అంటే ప్రజలని మెచ్చుకోవాలి అని కోర్టు వ్యాఖ్యానించింది. హనుమంతుడిని సీతని దేనికి పనికిరాని వాళ్ల‌లాగా చూపించారని కోర్టు వ్యాఖ్యానించింది.

అంతే కాక సినిమాలో డైలాగ్స్ మార్చ‌డంపై స్పందిస్తూ.. మరి సీన్లు ఎవరు మారుస్తారు అని ప్ర‌శ్నించింది. రాముడిని, రావణుడిని, లంకని, ఆంజనేయుడిని చూపించి ఇది రామాయణం కాదు అంటే చూసే ప్రజలు బుర్రలేని వాళ్ళు అనుకున్నార్రా అని కోర్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఐతే ఆదిపురుష్ టీం మీద కోర్టు చ‌ర్య‌లేమీ సూచించ‌లేదు. మంద‌లింపుతో స‌రిపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. అయినా థియేట్రిక‌ల్ ర‌న్ దాదాపుగా ముగిసిన చిత్రంపై ఇప్పుడు ఏ చ‌ర్య‌లు తీసుకున్నా పెద్ద‌గా తేడా ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు.