ట్రైలర్ బాలేకుంటే.. మరో ‘ఆచార్య’నే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ మీద ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. అందుకు మొదటి కారణం ఇది రీమేక్ కావడం. అందులోనూ ఎనిమిదేళ్ల కిందటి ఒక రొటీన్ మాస్ మూవీ ఆధారంగా ఈ సినిమా తీయడంతో అభిమానులకు ముందే సగం ఆశలు చచ్చిపోయాయి. దీనికి తోడు శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు ఇచ్చి.. పదేళ్ల పాటు సినిమాలే తీయని మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో మిగతా ఆశలు కూడా చచ్చిపోయాయి.

ఐతే మెహర్ చిరుకు దూరపు బంధువు కావడం.. పైగా కరోనా టైంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవడంతో అతనికేదో సాయం చేసే ఉద్దేశంతో చిరు ఈ ప్రాజెక్టును తనకు అప్పగించినట్లుగా మెగా వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో అభిమానులు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ సినిమా చూసేందుకు రెడీ అయ్యారు. ఐతే తక్కువ అంచనాలు పెట్టుకున్నా సరే.. టీజర్ చూశాక మెగా అభిమానులకే రుచించలేదు.

ఈ రోజుల్లో ఏ స్టార్ హీరో కూడా చేయనంత పరమ రొటీన్ సినిమాను చిరు చేశాడని టీజర్ చూస్తే అర్థమైంది. ఒరిజినల్ కంటే ముతకగా సినిమా ఉండబోతోందనే సంకేతాలను టీజర్ ఇచ్చింది. దీనికి తోడు చిరుకు తెలంగాణ యాస కుదరకపోవడం.. ఆయన డైలాగ్ డెలివరీ కూడా తేడా కొట్టడంతో సినిమా మీద నెగెటివిటీని పెంచేస్తోంది.

సోషల్ మీడియాలో రెస్పాన్స్ చూస్తే సగటు ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు సైతం ఈ సినిమా మీద ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రోల్ మెటీరియల్‌లా మారుతుందేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీజర్ సంగతి ఇలా ఉంటే ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది. అది అయినా కొంచెం మెరుగ్గా ఉండి.. ఇంటెన్సిటీ కనిపించకపోతే.. ఏదో ఒక సర్ప్రైజ్ అందులో లేకుంటే మాత్రం సినిమా రిజల్ట్ మీద ముందే ఒక అంచనాకు వచ్చేయొచ్చు. చిరుకు మళ్లీ ‘ఆచార్య’ తరహా చేదు అనుభవం తప్పకపోవచ్చు.