గెస్ట్‌గా రమ్మంటే 2 లక్షలడిగాడు.. సుమన్‌పై దర్శకుడి ఫైర్

ఒకప్పటి టాలీవుడ్ హీరోల్లో సుమన్ ఒకరు.. ప్రస్తుతం క్యారెక్టర్, విలన్ రోల్స్ చేస్తున్న సుమన్‌పై సీనియర్ దర్శకుడు నర్రా శివనాగు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నటరత్నాలు’ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్‌కు అతిథిగా రావాలని ఆహ్వానిస్తే.. రూ.2 లక్షలు డబ్బులు డిమాండ్ చేశాడంటూ ఆయన సుమన్ తీరును తప్పుబట్టారు.

తాను సుమన్‌తో మూడు సినిమాలు చేసిన అనుబంధంతో ఈ ఈవెంట్‌కు పిలిస్తే.. ఆయన డబ్బులు అడగడం తనను ఎంతగానో బాధించినట్లు నర్రా శివనాగు ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా, రంగస్థలం మహేష్, సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషించిన ‘నటరత్నాలు’ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన వేడుకలో శివనాగు.. సుమన్ మీద ఫైర్ అయ్యారు.

నేను పిలిస్తే చాలామంది పెద్దవాళ్లు ఈ ఈవెంట్ కి వస్తారు. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు ఒకప్పుడు నాతో కలిసి ఉన్నవారే. నేను సినీ పరిశ్రమలో పడ్డ కష్టాలని ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేశాను. నేను ఒక హీరోతో మూడు సినిమాలు చేశాను. అతనితో నాకు మంచి అనుబంధమే ఉంది. అతణ్ని ఈ ఈవెంట్ కి గెస్ట్‌గా పిలవమని కొందరు చెప్తే సరే అని అతనికి కాల్ చేశాను. తన మేకప్ మ్యాన్‌తో మాట్లాడమని చెప్పాడు. అతను పది రోజుల పాటు సరిగ్గా సమాధానం చెప్పకుండా కాల్స్ చేయించుకొని చివరికి రెండు లక్షలు ఇస్తే సార్ ఈవెంట్‌కి వస్తారు అన్నాడు.

ఆ హీరో ఎవరో కాదు సుమన్. నా ఈవెంట్‌కి నీకు డబ్బులిచ్చి పిలిపించుకుని నీకు సన్మానం చేయాలా? నీకు నేను డబ్బులిచ్చి మళ్లీ నీ గురించి గురించి మంచిగా మాట్లాడాలా? నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్తావా? నేను ఇదే మాట ఆ మేకప్ మ్యాన్ దగ్గర అన్నాను. తర్వాత కనీసం సుమన్ గారి నుంచి నాకు కాల్ కూడా రాలేదు. సుమన్ గారూ మీరు చేసింది తప్పు. మీరు చేసిందానికి నేను చాలా హర్ట్ అయ్యాను’’ అని శివనాగు తీవ్ర ఆవేదన స్వరంతో అన్నారు.