తమన్ అయిపోయాడు.. పూజా మీద పడ్డారు

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాకు సంబంధించి వివాదాలు, రూమర్లు ఎంతకీ ఆగడం లేదు. టీజర్ రిలీజ్ తర్వాత నెగెటివిటీ అంతా పోయి అంతా సానుకూలంగా మారిందని అభిమానులు సంతోషిస్తున్న సమయంలో కొత్త షెడ్యూల్ ఆలస్యం కావడం.. దీనికి తోడు రకరకాల రూమర్లు వినిపించడం మహేష్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.

ఈ సినిమా నుంచి తమన్‌ను సంగీత దర్శకుడిగా తప్పించారనే వార్తలు నిన్నట్నుంచి హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు నచ్చకపోవడం వల్లే తమన్ వైదొలగాల్సి వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే తమన్ ఈ సినిమా నుంచి తప్పుకోలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ధ్రువీకరించాడు. అంతటితో కథ సుఖాంతం అయిందిలే అనుకుంటే ఇప్పుడు కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.

‘గంటూరు కారం’ నుంచి హీరోయిన్ పూజా హెగ్డేను తప్పించారనే వార్త ఈ ఉదయం నుంచి హల్‌చల్ చేస్తోంది. కొన్నేళ్లుగా త్రివిక్రమ్ ఫేవరెట్ హీరోయిన్‌గా ఉన్న పూజాను సినిమా నుంచి తప్పించడం అంటే ఆశ్చర్యంగా అనిపించే విషయమే. మరి ఆమెను తప్పించేందుకు దారి తీసిన కారణాలేంటన్నది అర్థం కావడం లేదు.

ఇంతకీ ఇది అయినా నిజమైన వార్తా.. లేక తమన్ విషయంలో మాదిరే సోషల్ మీడియా జనాలు పొరబడ్డారా.. లేక ఎవరైనా పనిగట్టుకుని ఈ సినిమా గురించి ఇలాంటి నెగెటివ్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. ‘గంటూరు కారం’లో పూజా లీడ్ హీరోయిన్‌గా ఎంపిక కాగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా వచ్చింది. మరి ఇప్పుడు పూజా వైదొలుగుతున్న మాట వాస్తవమే అయితే.. ఆమె స్థానంలోకి ఎవరొస్తారో చూడాలి. చిత్రీకరణ మధ్యలో ఉండగా ఒక సినిమాకు సంబంధించి ఇన్ని మార్పులు చేర్పులు, రూమర్లు ఏంటో సినీ జనాలకు అంతుబట్టడం లేదు.