స్టూడెంట్స్ సభలో సర్కార్ స్పీచ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు ఒకప్పుడంటే ఏమో కానీ తుపాకీ నుంచి క్రమంగా తెలుగు మార్కెట్ బలపడుతూ వచ్చింది. అతని యావరేజ్ ఎంటర్టైనర్లు మనదగ్గరా బాగానే వసూలు చేస్తున్నాయి. బీస్ట్ ఫ్లాప్ అయినా, వారసుడు టీవీ సీరియల్ అనే కామెంట్స్ తెచ్చుకున్నా రెవిన్యూ యాంగిల్ లో బయ్యర్లకు పే చేశాయి. అందుకే తన కదలికలను ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఏపీ తెలంగాణలో గట్టిగానే ఉన్నారు. ఆ మధ్య హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు కూడా చేశారు. ప్రస్తుతం తను చేస్తున్న లియో మీద ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే.

ఇక టాపిక్ సంగతికొస్తే తాజాగా విజయ్ పదో తరగతి, ఇంటర్ మీడియట్ లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులుకు స్వయంగా పురస్కారాలు అందజేసేందుకు చెన్నైలో ఒక సభ ఏర్పాటు చేశాడు. నిర్వహించింది ఫ్యాన్స్ అసోసియేషనే అయినా నిధులు మాత్రం విజయ్ ఇచ్చాడట. అయితే ఈ సందర్భంగా తనే నటించిన సర్కార్ సినిమాలో ఉన్న సందేశాన్ని సీరియస్ గా, మరింత లోతుగా వచ్చిన స్టూడెంట్స్ కి స్పీచ్ రూపంలో ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెయ్యి రూపాయలిచ్చి ఓటుని అమ్ముకుని భవిష్యత్తుని తాకట్టు పెట్టొద్దని, నిజాయితీకి పట్టం కట్టాలని  హితవు పలికాడు

విజయ్ కి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోయినా ఇలాంటి కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బాగా చదువుకోండి, పెద్ద స్థాయికి వెళ్ళండి, కంపెనీలు పెట్టండి అని చెప్పడానికి బదులు ఇలా ఓటు విలువ, ప్రభుత్వాల అవినీతి గురించి చెప్పడం ఏమిటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  వరిసు రిలీజ్ టైంలో తునివు హక్కులు కొన్న సిఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఎక్కువ థియేటర్లు రాకుండా చేశారనే కోణం కూడా కొందరు తవ్వుతున్నారు. మొత్తానికి విజయ్ ప్రసంగం కొత్త చర్చకు దారి తీసిన మాట వాస్తవం