సుదర్శన్ జ్ఞాపకాలకు సెలవు తప్పదా

తెలుగు రాష్ట్రాల్లోని ఐకానిక్ థియేటర్స్ లో హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం ఒకటి. దీనితో అందరు హీరోల అభిమానులకు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది తమ స్వంత అడ్డాలా ఫీలవుతుంటారు. కొత్త రిలీజు దాంట్లో పడిందంటే సగం హిట్టయినట్టేనని ఫీలయ్యే వాళ్ళు ఎందరో. అలాంటి ల్యాండ్ మార్క్ త్వరలో చెరిగిపోతుందా అంటే ఔననే సమాధానం వస్తోంది. నిన్న అల్లు అర్జున్ ఏఏఏ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ సందర్భంగా ఏషియన్ సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

త్వరలోనే సుదర్శన్ స్థానంలో తమ భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్ తీసుకొస్తామని ప్రకటించారు. అయితే అది గతంలో ఉన్న సుదర్శన్ 70 ఎంఎం స్థలంలోనా లేక మొత్తం తీసేసి పెద్ద సముదాయం నిర్మిస్తారా అనేది చెప్పలేదు. ఎందుకంటే వీటికి ఆనుకునే దేవి 70 ఎంఎం ఉంది. దీనిధీ పెద్ద చరిత్రే. ప్రస్తుతానికి అక్కడ మల్టీ ప్లెక్సులు లేకపోవడం వల్లే ఆ అవకాశాన్ని కార్పొరేట్ సంస్థలు అంది పుచ్చుకోవడానికి ఎదురు చూస్తున్నాయి. ఇవి ఎన్ని వచ్చినా సింగల్ స్క్రీన్లలో వచ్చే అనుభూతి, విశాలమైన స్థలంలో నడిచే వాతావరణం గొప్పగా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈ కల్చర్ తగ్గిపోతోంది

దీనికి సంబంధించిన మరింత క్లారిటీ త్వరలోనే రావొచ్చు. ఏషియన్ ప్లాన్లు భారీగా ఉన్నాయి. చెన్నైలో శివ కార్తికేయన్ తో కలిసి ఏఎస్కె స్టార్ట్ చేయబోతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెండెకరాల స్థలంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బిజినెస్ ని విస్తరించే క్రమంలో ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు అన్ని వైపులా మల్టీప్లెక్సులు పెడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సింగల్ స్క్రీన్లు కళ్యాణ మండపాలు, మల్టీప్లెక్సులుగా మారిపోయాయి. ఇంకో పాతికేళ్ల తర్వాత అనగనగా ఒక సినిమా హాలు అంటూ కథలుగా చెప్పుకోవాల్సి వస్తుందేమో