AAA మల్టీప్లెక్స్ ఎలా ఉందంటే

నిన్న అట్టహాసంగా మొదలైన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ పట్ల హైదరాబాద్ మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. మహేష్ బాబు ఏఎంబి బ్లాక్ బస్టర్ అయ్యాక మళ్ళీ ఆ స్థాయిలో ఇంకో స్టార్ హీరో ఎవరూ ఈ బిజినెస్ లోకి  అడుగు పెట్టలేదు. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో పెట్టాడు. అల్లు అర్జున్ అదే ఏషియన్ గ్రూప్ తో కలిసి అమీర్ పేట్ లో ఉన్న సత్యం స్థానంలో ఏఏఏ తీసుకొచ్చారు. ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా  మిగిలిన మాల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. నిన్న మీడియాకు ప్రత్యేకంగా టూర్ చేయించి దీని తాలూకు విశేషాలు చూపించారు. ఇంతకీ ఏఏఏ సినిమాస్ ఎలా ఉందంటే.  

ఇందులో మొత్తం అయిదు స్క్రీన్లు ఉన్నాయి. మొదటిది అత్యంత పెద్దది. బార్కో లేజర్ ప్రొజెక్షన్ తో పాటు అత్యాధునిక సౌండ్ సిస్టంని  జతపరచడం వల్ల అనుభూతి గొప్పగా ఉంది. రెండోది తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఓనిక్స్ ఎల్ఈడి స్క్రీన్. దీనికి ప్రొజెక్టర్ ఉండదు. తెరవెనుక టీవీ  తరహా కనెక్షన్ తో ఆపరేట్ చేస్తారు. స్పష్టత విషయంలో దీనికేది సాటిరాదు. మిగిలిన మూడు రెగ్యులర్ మోడల్ లో ఉన్నప్పటికీ యాంబియెన్స్, ఇంటీరియర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అల్లు అర్జున్ సినిమాల పోస్టర్లు, ఫ్యామిలీ ఫోటోలతో ప్రత్యేకంగా లాంజ్ పేరుతో గ్యాలరీ ఏర్పాటు చేశారు

సెల్లార్ లో మూడు అంతస్థుల పార్కింగ్ ఏర్పాటు చేశారు. విపరీతంగా రద్దీ ఉండే ప్రాంతం కావడంతో ట్రాఫిక్ సమస్యని ఎలా పరిష్కారం చేస్తారో చూడాలి. ఇప్పటిదాకా ప్రీమియర్లకు ఏఎంబి, ప్రసాద్స్, బంజారా హిల్స్ సినీ మ్యాక్స్ మాత్రమే ఆప్షన్లుగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో ఏఏఏ చేరబోతోంది. టికెట్ ధర 295 రూపాయలు నిర్ణయించారు. స్క్రీన్ ల బయట ఎల్ఈడి తెరలు, వాటి మీద ట్రైలర్ల ప్రదర్శనలు, చాలా పెద్ద ఫుడ్డు కోర్టు ఆకర్షణీయంగా ఉన్నాయి.  మొత్తానికి ఫస్ట్ లుక్ ఇంప్రెషన్ లో ఏఏఏ సినిమాస్ ఫుల్ మార్కులు కొట్టేసింది. కొద్ది రోజులయ్యాక ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ చూడాలి.