రివ్యూలపై పడటం న్యాయమా?

సినిమా వాళ్లు రివ్యూల మీద అసహనం వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ నుంచి తాజాగా ‘బిగ్ బాస్’ ఫేమ్ సన్నీ దాకా చాలామందే రివ్యూ రైటర్లను విమర్శించిన వాళ్లే. ఐతే సినిమా ఫలితం ఒక షో పూర్తయ్యే లోపే తేలిపోతుండటం.. నెగెటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయి.. మినిమం ఓపెనింగ్స్ కరవైపోతుండటంతో  సినిమా వాళ్ల ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. కానీ సినిమా పోవడానికి రివ్యూలే కారణం కాదని.. బేసిగ్గా బాగున్న సినిమాను రివ్యూలు దెబ్బ కొట్టలేరని.. అలాగే బాగా లేని సినిమాను రివ్యూలు కాపాడలేవని అర్థం చేసుకోలేకపోవడమే చిత్రం.

ప్రమోషన్లతో హడావుడి చేసి తొలి రోజు, తొలి వీకెండ్లోనే వీలైనంత లాగేద్దామని సినిమా వాళ్లు చూస్తున్నపుడు.. సినిమాకు టాక్ తెలుసుకునే థియేటర్లకు వెళ్లాలని ప్రేక్షకులు ఆశించడంలో తప్పు లేదు. వాళ్ల డిమాండ్‌కు తగ్గట్లే వెబ్ సైట్లు రివ్యూలు ఇస్తున్నాయి. ఈ ఇంటెర్నెట్, పోటీ యుగంలో తాపీగా రివ్యూలు రాసే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఒక  సినిమాను కావాలనే రివ్యూ రైటర్లు టార్గెట్ చేస్తుంటే..బాగున్న సినిమాను కూడా బాలేదని పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తప్పు కానీ.. బాలేని సినిమాను బాలేదని అంటే తప్పెలా అవుతుంది. గత ఏడాది ‘రామారావు ఆన్ డ్యూటీ’ దర్శకుడు శరత్ మండవ.. రిలీజ్‌కు ముందు రివ్యూ రైటర్ల మీద తీవ్ర విమర్శలు చేశాడు.

వాళ్ల గురించి కొంచెం వెకిలిగా కూడా మాట్లాడాడు. తీరా అతను తీసిన కళాఖండం చూసి.. ఇలాంటి సినిమా తీసి అలాంటి మాటలా అని ముక్కున వేలేసుకున్నారు జనాలు. ‘రామారావు’ చూసిన ప్రేక్షకుల ఫ్రస్టేషన్ అంతా ఇంతా కాదు. టాక్ తెలుసుకోకుండా, రివ్యూలు చూడకుండా ఆ సినిమాకు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడూ చింతించే ఉంటాడు. రిలీజ్‌కు ముందు అంత మాట్లాడిన శరత్.. రిలీజ్ తర్వాత అడ్రస్ లేడు. ఇక్కడ ప్రేక్షకుడి టికెట్ డబ్బులు, తన విలువైన రెండున్నర గంటల సమయం, అతడి ఆనందం సంగతేంటి? సినిమా తీసేవాళ్లు పెట్టే కోట్ల ముందు.. ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయా? 

తన డబ్బు, సమయానికి సరైన విలువను చేకూర్చే సినిమా చూాడాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. అందుకు రివ్యూలను ఆశ్రయిస్తాడు. వాళ్లకు కావాల్సిన ఫీడ్ బ్యాక్‌ను రివ్యూలు ఇస్తాయి. సినిమా తీయడం తీసేవాళ్ల పని అయితే.. రివ్యూలు రాయడం రాసే రైటర్ల పని. సినిమా గురించి రాయాలంటే సినిమాలు తీయండి అంటూ ‘అన్ స్టాపబుల్’ హీరో సన్నీ సవాలు విసరడం విడ్డూరం.

అంటే సినిమా గురించి మాట్లాడ్డానికి సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్హత లేనట్లే. అతను సినిమాను విమర్శించినా.. వచ్చి సినిమా తీసి మాట్లాడు అని సవాల్ చేస్తారా? ఇదేం లాజికో సన్నీనే చెప్పాలి. మొన్న ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిపోయింది. అభిమానులు మనవాళ్ల ఆట తీరును ఎండగట్టారు. ముందు వచ్చి ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడి చూపించమని భారత క్రికెటర్లు ఎవరూ అనలేదు. సునీల్ గవాస్కర్ ఈ విమర్శలకు భారత జట్టు అర్హమైందే అని.. వాళ్లేమీ అతీతులు కారని అన్నారే తప్ప.. ఎందుకు విమర్శిస్తారు అనలేదు. కాబట్టి సరైన సినిమా తీయకుండా.. రివ్యూ రైటర్ల మీద పడటంలో అర్థం లేదని సన్నీ అర్థం చేసుకుంటే మంచిది.