బన్నీ, త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తున్నారు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘జులాయి’ అప్పట్లో సూపర్ హిట్ అయి బన్నీ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. వీరి రెండో చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ యావరేజ్‌గా ఆడినా.. మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’ మాత్రం సంచలన వసూళ్లతో నాన్ బాహుబలి హిట్‌గా నిలిచింది. వీరి కలయికలో ఇంకో సినిమా కూడా రావచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ లోపు ఈ ఇద్దరూ చేతులు కలపడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ కలయిక గురించి ఆహా ఓటీటీ నిన్న ప్రకటన చేసింది. ముందు త్రివిక్రమ్ పేరు చెప్పకుండా.. బన్నీతో కొలాబరేట్ అవుతున్న ‘మాంత్రికుడు’ అంటూ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కలిసి ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే సినిమా కోసం కలిసేట్లయితే ఆహా వాళ్లు ఇలా అనౌన్స్‌మెంట్ ఇవ్వరు. ఆ హంగామా వేరుగా ఉంటుంది.

మరి బన్నీ, త్రివిక్రమ్ కలిసి ఏం చేయబోతున్నారు.. మధ్యలో ‘ఆహా’ వాళ్లకు దీని మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆహా కోసం వీళ్లేదైనా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా.. లేక ప్రోమో లాంటిది ఏమైనా చేస్తున్నారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 16న హైదరాబాద్‌లో ఆరంభం కాబోతున్న ‘ఏఏఏ’ మల్టీప్లెక్స్ కోసం ఇద్దరూ ఒక యాడ్ చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

ఏషియన్ మూవీస్‌ వాళ్లతో కలిసి బన్నీ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ‘ఆదిపురుష్’ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతోంది. మరి బన్నీ, త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తున్నారన్నది ఆసక్తికరం. ఈ సంగతి పక్కన పెడితే ‘పుష్ప’ తర్వాత బన్నీ చేయబోయే సినిమాకు త్రివిక్రమే దర్శకుడని అంటున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబుతో ‘గుంటూరు కారం’ చేస్తున్న త్రివిక్రమ్.. బన్నీ కోసం ఒక కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.