అనుమతుల కోసం ఆదిపురుష్ ఎదురుచూపులు

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు. ప్రభాస్ అభిమానులు , టాలీవుడ్ ప్రేమికులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఆదివారం నుంచి ఉంటాయని నిర్మాతలు ప్రకటించారు కానీ ఇంకా షురూ చేయలేదు. నార్త్ సైడ్ ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి ప్రధాన నగరాల్లో ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. త్రీడి ప్రింట్ రెడీ కాలేదనే అనుమానాల నేపథ్యంలో  అనుమానాలకు  చెక్ పెడుతూ ఆ వెర్షన్ అమ్మకాలు కూడా స్టార్టయ్యాయి. కానీ ఏపీ తెలంగాణకు సంబంధించి థియేటర్లను లాక్ చేసుకున్నా ఇప్పటి దాకా పేటిఎం, బుక్ మై షోలో అప్డేట్స్ లేవు.

టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి నిర్మాతలు చేసుకున్న విన్నపాలకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంటుంది. తెలంగాణలో పర్మిషన్ లేకుండానే 295 రూపాయలు గరిష్ట ధరని మల్టీప్లెక్సులు పెట్టేసుకోవచ్చు. ఇంకా యాభై అదనంగా ఆశిస్తున్నట్టు ట్రేడ్ టాక్. అదే జరిగితే త్రీడి అద్దాలతో కలిపి రేట్ 380 రూపాయల దాకా చేరుతుంది. ఇక ఏపీలో గరిష్ట ధరనే 177 కాబట్టి అదనంగా ఇంకో యాభై ఓకే అయినా 230 దాటదు. ఇది కొంత నయమే. అంతకన్నా ఎక్కువ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు మరీ ఎక్కువ ఇచ్చేస్తే రాబోయే పెద్ద హీరోలందరికీ సరేనని అనాల్సి ఉంటుంది.

జీవోలు రావడం ఆలస్యం వెంటనే అమ్మకాలు ఊపందుకుంటాయి. బెనిఫిట్ షోలకు సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వీలైనంత త్వరగా ఎక్కువ షోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం మినహాయిస్తే ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి థియేటర్ యాజమాన్యాల మీద విపరీతమైన ఒత్తిడి మొదలవుతోంది. ప్రీమియం మల్టీప్లెక్సుల టికెట్ల కోసం అప్పుడే పెద్ద స్థాయిలో పైరవీలు మొదలయ్యాయట. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామి మాములుగా ఉండదని ట్రెండ్ ని బట్టి బయ్యర్లకు స్పష్టంగా అర్థమైపోయింది